మూడో వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొందాం అని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామని హరీష్రావు పిలుపునిచ్చారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పని చేయాలని అధికారులకు సూచించారు. 15-18 ఏండ్ల వారి వ్యాక్సినేషన్ వేగం పెంచాలన్నారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్సీ కేంద్రాల్లో ఐసోలేషన్ కిట్లు, పరీక్ష కిట్లనను సిద్ధం చేయాలన్నారు. లక్షణాలు ఉంటే పరీక్ష చేసి, వెంటనే కిట్లు అందించాలని సూచించారు.
Read Also: టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెండ్
బాధితుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీ పరిశీలించాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, ప్రమాదం తక్కువగా ఉందని భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. నాన్ కోవిడ్ సేవలకు ఎట్టిపరిస్థితుల్లో అంతరాయం కలగకుండా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు సిద్ధం కావాలని మంత్రి పేర్కొన్నారు.