వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగింపుకు వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఈరోజు నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు రానున్నాయి. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
ఉత్తర్వుల ప్రకారం 50 శాతం వ్యవసాయ భూముల మార్కెట్ విలువ పెరిగింది. ఖాళీ స్థలాల విలువ 35 శాతం, ప్లాట్ల విలువ 25 శాతం పెంపుతో పాటు పెరిగిన విలువకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయనున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలలో విలువ పెంపు.. పెరిగిన విలువ ప్రకారం సబ్ రిజిస్టర్ సాఫ్ట్వేర్ లో రిజిస్ట్రేషన్ శాఖ మార్పులు చేసింది. రాష్ట్రంలో తొలిసారి ఖాళీ స్థలం చదరపు గజం ధర లక్ష దాటింది. దీంతో పాటు ప్లాట్ చదరపు అడుగు విలువ 9 వేలు దాటింది. మార్కెట్ విలువలు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రిజిస్ట్రేషన్ ద్వారా జనవరి లోనే ప్రభుత్వానికి 1200 కోట్ల ఆదాయం రావడం విశేషం.