తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మంతనాలు జరిపారు.. ఇదే సమయంలో.. మాజీ ఎంపీ రమేష్ రాథ్డో, ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వద్ధామరెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవ రెడ్డి కూడా ఈటల నివాసానికి వచ్చారు.. దీంతో.. వీరుకూడా టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది..
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలపై అసంతృప్తితో ఉన్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం మంటున్నారు.. ఇది జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టే.. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన.. వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్తో పాటు రమేష్ రాథోడ్, ఆర్టీసీ టీఎంయూ నేత ఆశ్వద్ధామరెడ్డి , కంటోన్మెంట్కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.. ఈటల రాజేందర్ నివాసంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జీ తరుణ్ చుగ్ని కలిసి వారి అభిప్రాయాలను తెలిపినట్టు తెలుస్తోంది.. వారికి ఉన్న అనుమానాలను కూడా ఆయన ముందు పెట్టారని సమాచారం.