హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నామినేషన్లకు నేటితో గడువు ముగిసిపోనుంది. చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు 15 మంది నామినేషన్లు వేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు దాఖలు కాగా… గురువారం 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేయనున్నారు. ఇవాళ పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఈటెల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు.
నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపఎన్నిక ఇంచార్జ్ జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. గత ఐదు నెలలుగా ప్రచారంలోనే ఉన్నారు ఈటెల. మరోవైపు ఈటెల సతీమణి జమున తరపున ఇప్పటికే కార్యకర్తలు మూడు సెట్ల నామినేషన్ వేశారు. ఈటెల రాజేందర్ తరపున ఒక సెట్ నామినేషన్ వేశారు బిజెపి కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలుమూరి వెంకట్ చివరిరోజు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసిన వెంటనే ప్రచారం మెదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్లమెంటరి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ లతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.