రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి అయింది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ధాన్యం కుప్పపైనే ప్రాణాలు విడిచాడు. రైతు బీరయ్యకు ఎకరం సొంత పొలం ఉండగా.. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.
ఇటీవల కోతలు పూర్తి చేసి గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. అదే రోజు అక్కడున్న సిబ్బంది సీరియల్ నంబర్ రాసుకోగా.. బీరయ్య వంతు 70 నంబర్ వచ్చింది. అయితే నిన్న, ఈరోజు దీపావళి, అంతకుముందు రోజు వర్షం కారణం గా కాంటా వేయలేదు. ధాన్యం కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తోంది. ధాన్యం తూకం వేసేందుకు ఒక్కో రైతు 20 రోజులకు పైగా ఎదురుచూడాల్సి వస్తోంది.
లింగంపేట కేంద్రానికి మొత్తం 207 మంది రైతులు ధాన్యం తీసుకురాగా.. వారం రోజుల నుంచి కేవలం 23 మందివి మాత్రమే తూకం వేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, 3 రోజులు కాంటా బంద్ ఉండటంతో మానసికంగా ఆందోళన చెంది బీరయ్య మరణించ వచ్చని రైతులు అభిప్రాయ పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా… అన్ని చోట్లా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.