తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు మూడు విడతల డీఏ బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీ చేసింది. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో 7.28 శాతంగా ఉండే డీఏ 17.29 శాతానికి పెరగనుంది. దీంతో పెండింగ్లో ఉన్న మూడు డీఏలకు బదులుగా ఈ కొత్త లెక్క వర్తించనుంది. పెరిగిన డీఏ 2021 జూలై నుంచి వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది.
Read Also: తగ్గేదిలే: మనిషికి ఏమాత్రం తీసిపోనంటున్న చింపాంజీ
కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులదరికీ డీఏ పెంచాలని ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా రాష్ట్ర ఉద్యోగులకు ప్రతి ఆరునెలలకు ఒకసారి డీఏను ప్రకటించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచలేదు. దీంతో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఒకే సారి ప్రకటించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సీపీఎస్ వర్తించే ఉద్యోగులకు బకాయిల్లో పది శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయనున్నారు. 90 శాతాన్ని జూన్ నెల నుంచి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే విశ్రాంత ఉద్యోగులకు కూడా డీఏ జూన్ నెల నుంచి వర్తించనుంది.