Madhira Muncipality : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో భట్టి విక్రమార్క పరపతిని మరోసారి చాటిచెప్పింది.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 22 వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ , ఆ పార్టీ బలపరిచిన టీడీపీ అభ్యర్థులు కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. ఫలితాలు వెలువడగానే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఏకంగా 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కేవలం ఒక్క వార్డులో మినహా మిగిలిన అన్ని చోట్లా హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించి విపక్షాలకు నామరూపాలు లేకుండా చేశారు.
PM Modi: ప్రధాని మోడీకి ఢాకా ఆహ్వానం..?
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పదేళ్ల కాలంలో మధిరలో జరిగిన అభివృద్ధి లోపాలను ఎత్తిచూపుతూనే, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. భట్టి వేసిన ఈ రాజకీయ వ్యూహాలు పక్కాగా ఫలించడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. “అభివృద్ధి, సంక్షేమానికి మధిర ప్రజలు పట్టం కట్టారు” అని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలో తిరుగులేని మెజారిటీ రావడంతో, మధిర మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కౌన్సిలర్కు దక్కడం ఇప్పుడు లాంఛనమే అయింది. ఎల్లుండి జరగనున్న చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ అధికారికంగా మున్సిపల్ పీఠాన్ని అధిరోహించనుంది. పదేళ్ల తర్వాత మధిర పురవీధుల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం చూసి పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
Bangladesh: జూలై చార్టర్కు 70% బంగ్లాదేశీయుల ఓట్.. అసలు ఏంటి ఇది..?