CM Revanth Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారంలో జరిగిన సిగాచి రసాయన పరిశ్రమ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్రమను స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేసిన అనంతరం, సీఎం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలుపై సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ అనుమతులు ఇచ్చే సమయంలో పరిశీలన జరిగిందా లేదా?, పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరూ, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ పరిశ్రమను తనిఖీ చేశారా వంటి కీలకమైన ప్రశ్నలు అడిగారు. అనంతరం ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని, ఇప్పటికే పరిశీలించిన అధికారులతో కాకుండా కొత్త బృందంతో దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్ .. నితిన్కు ఈసారైన హిట్ దక్కేనా..!
సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాద నివారణకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ప్రతి శాఖ సమన్వయంతో స్పందించాలి అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, రియాక్టర్ల పేలుడు ఘటనపై పూర్తి నివేదికను సత్వరంగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, బాధితుల కుటుంబాలకు మానవత్వంతో సహకరించాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యం మీద ఉందని సీఎం స్పష్టం చేశారు. అంతేగాక, ఘటనలో గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, బాడీలను ట్రేస్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఆర్థికంగా తక్షణ సాయం కల్పించాలన్న సీఎం రేవంత్.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలన్నారు. అయితే.. క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామన్న ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది.
పరిశ్రమను తనిఖీ చేసిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు.
Tamil Nadu: శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి