రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నేడు మరోసారి భేటి అయ్యారు. నిన్న ఉదయం నుంచి పీకేతో సీఎం కేసీఆర్ సాయంత్రం వరకు చర్చలు జరిపారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పీకే చేరబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ అదిష్టానంతో పీకే వరుసగా మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యల చేసిన సీఎం కేసీఆర్తో పీకే భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీంతో పాటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న నమ్మకంపై కూడా పీకే టీం గతంలో సర్వే చేసి కేసీఆర్ ముందుంచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై ఎండగడుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పీకే సీఎ కేసీఆర్తో భేటీ కావడం రాజకీయ నేతల్లో తెలియని క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే నిన్న కూడా సీఎం కేసీఆర్తో పీకే రాత్రి వరకు సమావేశమై.. రాత్రి ప్రగతి భవన్లోనే బస చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో నేడు పీకే తో సమాలోచనల తర్వాత సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్కు వెళ్లారు. ఈ సమావేశలంలో జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై ప్రధాన చర్చ జరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లోనే ఉన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఢిల్లీకి పీకే తిరుగు ప్రయాణం కానున్నారు.