హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఘరానా లూటీ జరిగింది. పట్టపగలే సినీఫక్కీలో ఓ కారు అద్దాలు పగులకొట్టి దొంగలు రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే… జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి, ఆయన కుమారుడు సాయి గణేష్… బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టారు. డ్రా చేసిన తర్వాత సంతకం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే… డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు.
Read Also: బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి.. కారు అద్దాలు ధ్వంసం
తాము బయటకు వచ్చి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై కనిపించడంతో అనుమానం వచ్చిందని… దీంతో కారు లోపల చూడగా డబ్బులు పోయినట్లు గుర్తించామని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని డీసీపీ పుష్ప పరిశీలించారు. నగదు దోచుకెళ్తున్న దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.