లోకో పైలెట్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కలిశారు. ఈ సందర్భంగా.. బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి లోకోపైలెట్ల సమస్య పరిష్కారంపై చర్చించారు. దీనిపై జీఎం అరుణ్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించినట్లు బండి సంజయ్ వెల్లడించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని అందులో భాగంగా లోకో పైలెట్ల యూనియన్ నేతలను చర్చలకు పిలవాలని కోరినట్లు బండి సంజయ్ తెలిపారు. లోకోపైలెట్ల ఆందోళనతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై జీఎంకు వివరించినట్లు, లోకోపైలెట్లు చేస్తున్న ఆందోళనతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు బండి సంజయ్.
లోకోపైలెట్ యూనియన్ నేతలను చర్చలకు ఆహ్వానించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే జీఎం సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులతోపాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి రైల్వే పనుల పురోగతిపైనా రైల్వే జీఎంతో బండి సంజయ్ చర్చించారు.