పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ ప్రజల అవసరాల దృష్ట్యా లీటర్ పెట్రోల్పై రూ.9.50, డీజిల్ 7 రూపాయల వరకు తగ్గేలా కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం గొప్ప విషయం అన్నారు.. తాజా నిర్ణయంతో కేంద్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయల వరకు తగ్గుతుంది. అయినప్పటికీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడంతోపాటు దేశంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయం అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయలు ధర తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించడం సంతోషించదగ్గ పరిణామం అన్నారు సంజయ్. దీనివల్ల దేశంలోని 9 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. తాజా నిర్ణయంవల్ల ప్రత్యక్షంగా కేంద్రంపై 6100 కోట్ల రూపాయల భారం పడుతున్పటికీ పేదల సంక్షేమం కోసం కేంద్రం సాహసోపేతం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతోపాటు నిర్మాణ రంగాన్ని ప్రభావితం చేస్తున్న స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించడానికి కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇనుమ, స్టీల్ ముడి సరుకును, వాటికి ఉపయోగించే ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతోపాటు ఆయా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని సైతం తగ్గించడం స్వాగతించదగ్గ పరిణామం. స్టీల్ ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం ద్వారా సిమెంట్ ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులో ఉండేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. బహిరంగ మార్కెట్ లో ఎరువులు ధరలు పెరుగుతున్నప్పటికీ… ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో భరించేందుకు ప్రస్తుత బడ్జెట్లో 1 లక్షా 5 వేల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం అవసరమైతే అదనంగా మరో లక్షా 10 వేల కోట్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించం గొప్ప నిర్ణయం అన్నారు.
అయితే, పెట్రోలు, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం గతంలోనూ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది.. వరుసగా రెండోసారి కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పన్నును తగ్గించకపోవడం దారణం అన్నారు బండి సంజయ్.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో దిగి రావాలి. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ర ప్రభుత్వం కూడా వెంటనే వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజలకు మరింత ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజానుగ్రహానికి గురి కాక తప్పదు అని హెచ్చరించిన బండి సంజయ్… అవసరమైతే వ్యాట్ పన్నును తగ్గించేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.