గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే… ఆ గ్రామాభివ్రుద్ది కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివ్రుద్ధి వైపు ద్రుష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ఈరోజు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశమిదే…
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహక నిధులిస్తామని హామీ ఇవ్వడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 70 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేశారు. కానీ ఐదేళ్లయినా ఆయా గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వకుండా మొండి చేయి చూపింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్ధికంగా నష్టపోయారు. ఆయా గ్రామాల్లో అభివ్రుద్ది పూర్తిగా కుంటుపడింది. దయచేసి ఈ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నా.
భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే తప్పదు. మీ బండి సంజయ్ ఎన్నడూ చేసేదే చెబుతాడు. చెప్పేదే చేస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తానని మాట ఇస్తున్నా. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రజల ముందు కొన్ని వాస్తవాలు ఉంచుతున్నా. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యలేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు. నన్ను కోసినా నయాపైసా రాదు’’అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం. అట్లాగే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి పైసా ఇయ్యలేదు. అప్పులు తెచ్చి అభివ్రుద్ధి చేసిన సర్పంచులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడటమే నిదర్శనం.
గ్రామాల అభివ్రుద్ధికి నిధులు ఇస్తోంది నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో కొనసాగుతున్నవే. భవిష్యత్తులోనూ గ్రామాలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అసలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేది కూడా కేంద్ర నిధుల కోసమేననే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నా. పంచాయతీ ఎన్నికలు జరగకపోతే కేంద్ర నిధులు రావనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందే తప్ప వాస్తవానికి స్తానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్దే లేదు.
ఇక ఎమ్మెల్యే, ఎంపీల విషయానికొస్తే…. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసుకునేందుకు ప్రత్యేకంగా నిధులు లేవు. గతంలో ఇచ్చిన సీడీఎఫ్(కాన్ స్టిట్యూయన్సీ డెవలెప్ మెంట్ ఫండ్)ను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా ఎమ్మెల్యేగా గెలిచినా పంచాయతీలకు నయా పైసా కూడా ఇయ్యలేని పరిస్థితి. కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నాకు ఎంపీ లాడ్స్ నిధులు ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బుల్ (సీఎస్సార్) ఫండ్ రూపంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఇప్పటికే విద్య, వైద్య రంగాలను అభివ్రుద్ధి చేసేందుకు ఖర్చు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేసినట్లయితే… ఆయా గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా. పూర్తిస్థాయిలో ఆ గ్రామాన్ని అభివ్రుద్ది చేసేందుకు క్రుషి చేస్తా. దీంతోపాటు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున కేంద్రాన్ని ఒప్పించి మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీల అభివ్రుద్దికి క్రుషి చేస్తా.
చివరగా ఒక్కమాట…. నిధులు ఇచ్చేది, తెచ్చేది బీజేపీ మాత్రమే. మరి అట్లాంటప్పుడు ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి ఏం లాభం? పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే కొత్తగా నిధులు రాకపోగా, కేంద్రం నుండి వచ్చే నిధులను కూడా దారి మళ్లించే ప్రమాదముంది. అందుకే మాయ మాటలు నమ్మకండి. ప్రలోభాలకు మోస పోకండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల పాటు నరక యాతన తప్పదు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బీజేపీ బలపర్చిన అభ్యర్ధులకు ఓటేసి గెలిపిద్దాం. మన గ్రామాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేసుకుందాం.’ అని బండి సంజయ్ అన్నారు.