ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని మండి పడ్డారు. సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసం పై స్పందిస్తూ.. సికింద్రాబాద్ లో రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇంత విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అగ్నిపథ్ కు ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని మండిపడ్డారు. టిఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని బండిసంజయ్ మండిపడ్డారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని బండి విమర్శించారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయస్థాయి సమావేశాలపై దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
కాగా.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై స్పందిస్తూ.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు సిల్లి అని తీసేసిన సిల్లి సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం.. మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని విమర్శించారు.
ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా.. టెర్రరిస్టులా అంటూ ప్రశ్నించారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న సీఎం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. విద్యార్థులకు భరోసా కల్పించేందుకే తాము ట్రిపుల్ ఐటికి వెళ్తున్నా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. అక్కడ ఆందోళనలు, ధర్నాలు చేయడానికి మాకేమైన సీఎం మాదిరిగా పనిపాట లేదా..? అంటూ మండి పడ్డారు బండిసంజయ్. పోలీసుల నిర్బంధంతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఆపడం సీఎం తాత తరం కూడా కాదని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు బండిసంజయ్. నిన్న కాంగ్రెస్ విధ్వంసానికి ఈరోజు రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి టిఆర్ఎస్ ప్రభుత్వ సహకారం ఉందని విమర్శించారు. ప్రభుత్వం పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకుందని మండిపడ్డారు. బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఇదంతా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఎవరికీ అన్యాయం చేయడని బండిసంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ మొద్దు నిద్రలో ఉన్నాడని ఎద్దేవ చేశారు.