తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని మండిపడ్డారు. ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని బండి సంజయ్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
Read Also: తెలియంది అడిగితే ఏం చెప్తారు.. కేటీఆర్పై షర్మిల ఫైర్
ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే చెల్లించేదని..కాని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయంబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తూ ఆ పై ర్యాంకు వచ్చిన వారికి రూ. 35 వేలు మాత్రమే చెల్లిస్తోందని.. దీంతో మిగిలిన ఫీజు కట్టలేక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని నిప్పులు చెరిగారు. బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో మాదిరిగానే ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నెం.18ను సవరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.