నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్ గ్యాస్ ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే నేడు బోధన్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం నేడు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్ లో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దించారు. ఈ సందర్భంగా సీపీ నాగారాజు మాట్లాడుతూ.. బోధన్ లో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోందన్నారు.
నిన్నటి ఆందోళనకు సంబంధించి 10 మంది అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 170 మందిని ముందస్తు అరెస్ట్ చేశామని, బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోందని ఆయన వివరించారు. నిన్నటి ఘటనలో అరెస్ట్ అయిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోద చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బోధన్ చుట్టూ ప్రత్యేక చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేశామని, స్థానికేతరులకు బోధన్ లో కి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సభలకు, సమావేశాలకు బోధన్ పట్టణంలోకి ప్రవేశం నిషేధమని, రాజకీయ పార్టీల నేతలు బోధన్ లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తామన్నారు.