కుటుంబాన్ని వదిలి అడవిలో బతుకుతున్న మావోయిస్టులు లొంగిపోవాలంటూ పోలీసులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాలకు చెందిన 43 మంది మావోయిస్టులు.. పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు. సుక్మా జిల్లా గాధిరాస్, చింతగుఫా, కుక్నార్, పుల్బగ్డీ గ్రామాలకు చెందిన వీరు బుధవారం ఎస్పీ సునీల్ శర్మ, సీఆర్ఫీఎఫ్ అధికారుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు.
అయితే వీరికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ సునీల్ శర్మ హామీ ఇచ్చారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టులతో కలసి సునీల్ శర్మ సహ పంక్తి భోజనాలు చేయడం విశేషం. అంతేకాకుండా ఎంతో మంది మావోయిస్టులు అనారోగ్యంతో బాధపడుతున్నారని వారు కూడా ఆయుధాలు వీడి ప్రజలతో మమేకం కావాలని సునీల్ శర్మ కోరారు.