హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును మంత్రి సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు.
చదువుల దేవాలయానికి హిందూత్వ వాదానికి ఆద్యుడైన సవార్కర్ పేరు పెట్టడం పూర్తి అభ్యంతరకరమని సీపీఐ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. మతాన్ని ఆధారంగా సమాజాన్ని విభజించే వాదాన్ని ప్రేరేపించి, భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీ అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగిన సవార్కర్ పేరు పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు.
ప్రజాభవన్లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని సూచించారు.
హైదరాబాద్లోని యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్లో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. డీఎస్పీ, ఇంటర్నేషనల్ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ఆమెతో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్పై భారత బ్యాట్స్మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.
నేడు తెలంగాణ గ్రీన్ & రెన్యువబుల్ ఎనర్జీ పాలసీపై భాగస్వాములతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి.. జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి.. తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాఠశాలకు వెళ్తొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా టీచర్స్ డే నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపింది.