అయితే, చంద్రయాన్-3 రాకెట్ విజయవంతం కావడంతో పలువురు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా.. ఈ ప్రయోగం విజయవంతంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది.. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం అని ప్రధాని అన్నారు.
భారతదేశం గర్వించేలా చంద్రయాన్-3 రాకెట్ ను నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.