మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యే పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.. ఈ రోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 మంది రౌడీ షీటర్స్ ను గృహనిర్బంధం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా వ్యాప్తంగా 1,038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.