ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్లు ఆడబోతోంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్తో మ్యాచ్లు ఆడిన భారత్.. గురువారం నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును టీమిండియా ఈసారి ఆడనుంది. అదే సమయంలో ఐర్లాండ్తో ఒక టీ20 మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఆ వెంటనే ఇంగ్లండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు టీమిండియా వెళ్లనుంది. అనంతరం యూఏఈలో జరిగే ఆసియా కప్లో భారత్ పాల్గొంటుంది. కాగా టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా రెండు బృందాలను తయారుచేయాలని బీసీసీఐ భావిస్తోంది. గత ఏడాది కూడా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో మరో టీమ్ను ధావన్ నేతృత్వంలో శ్రీలంక పర్యటనకు పంపిన విషయం తెలిసిందే.