IND vs PAK: భారత్తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం నాడు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్పై కొంతమంది పీసీబీ అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ, చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఇప్పటికీ సహకరించడం లేదని పేర్కొన్నాయి.
Read Also: Lawyers Fees Hike: కోర్టులో కేంద్రం తరపున వాదించే న్యాయవాదుల ఫీజులు పెంపు.. పూర్తి వివరాలు ఇవే
కాగా, ఈ నేపథ్యంలో ఈరోజు ( ఫిబ్రవరి 9న) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మరోసారి సమావేశమై చర్చలు జరపాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించారు. తుది నిర్ణయానికి ముందు ప్రధాని అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగనుంది. గత రెండు వారాల్లో ఇది రెండో అధికారిక సమావేశం కావడం గమనార్హం. ఫిబ్రవరి 15వ తేదీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also: Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా భారీ మైథలాజికల్ సినిమా ఫిక్స్
ఇదిలా ఉండగా, ఐసీసీతో ప్రతిష్టంభనను ముగించేందుకు పీసీబీ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం లాహోర్లో జరిగిన సమావేశంలో పీసీబీ ఈ డిమాండ్లను ఐసీసీ ముందుంచింది.
* బంగ్లాదేశ్కు పెరిగిన పరిహారం ఇవ్వడం,
* టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ బంగ్లాదేశ్కు పాల్గొనకుండా ఫీజు చెల్లించడం,
* భవిష్యత్తులో జరగనున్న ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్య హక్కులు కల్పించాలని తెలిపింది. కాగా, ఈ డిమాండ్లపై ఐసీసీ ఎలా స్పందిస్తుంది అనే దానిపై భారత్- పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉండనుంది.