Shivam Dube The Finisher for Team India: క్రికెట్ ఆటలో ఫినిషర్ పాత్ర ఎంతో కీలకం. ఇన్నింగ్స్ చివరలో స్కోర్ బోర్డు పరుగెత్తాలన్నా, టీమ్ విజయం సాధించాలన్నా ఫినిషర్ తప్పనిసరి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో. గతంలో భారత టీ20 జట్టులో యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు ఫినిషర్ పాత్ర పోషించారు. ఇప్పుడు రిషబ్ పంత్, శివమ్ దూబే, రింకూ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురిలో దూబే ఫినిషర్ పాత్రను అద్భుతంగా నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. గత 12 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్లలో అతడు చూపించిన స్థిరత్వం, దూకుడు ఇప్పుడు టీమిండియాకు భారీ ప్లస్గా మారింది.
శివమ్ దూబే చివరి 12 ఇన్నింగ్స్ల్లో ఫినిషర్గా రాణించాడు. 12 ఇన్నింగ్స్ల్లో 10*(3), 10*(4), 9(4), 36*(18), 65(23), 7*(2), 0(1), 23(16), 27(17), 66(31), 42(37), 8*(4) రన్స్ చేశాడు. ఈ 12 ఇన్నింగ్స్లలో 303 పరుగులు చేసిన దూబే సగటు 43.28గా ఉంది. అతని స్ట్రైక్ రేట్ 189.37 ఉండడం అతడి దూకుడును స్పష్టంగా చూపిస్తోంది. అవసరమైన సమయంలో బౌండరీలు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్ను ముగించే సామర్థ్యం అతనికి ఉంది. మధ్య ఓవర్లలో క్రీజులోకి వచ్చి మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడటం, చివర్లో వేగం పెంచడం దూబే ప్రత్యేకత. 23 బంతుల్లో 65, 31 బంతుల్లో 66 వంటి ఇన్నింగ్స్లు అతని మ్యాచ్ ఫినిషింగ్ నైపుణ్యాన్ని రుజువు చేశాయి.
Also Read: Sanju Samson: విరాట్ కోహ్లీ లేకున్నా 196 రన్స్ ఛేజ్ చేశాం.. ప్రెస్ మీట్లో సంజు స్ట్రాంగ్ కౌంటర్!
ఒత్తిడిలోనూ శివమ్ దూబే చూపిస్తున్న ధైర్యం జట్టుకు భరోసా కలిగిస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో దూబే దున్నేస్తున్నాడు. వెస్టిండీస్పై చావోరేవో మ్యాచ్లో కూడా 19వ ఓవర్లో రెండు కీలక బౌండరీలు బాది.. మొత్తం ఒత్తిడిని తగ్గించాడు. దాంతో చివరి ఓవర్లో భారత్ సునాయాస విజయం సాధించింది. ఫినిషర్ బాధ్యతను దూబే సమర్థంగా నిర్వర్తిస్తూ భారత్కు కీలక ఆయుధంగా మారుతున్నాడు. ఎప్పటికప్పుడు మంచి ప్రదర్శనలు ఇస్తూ జట్టులో తన స్థానం బలపరుచుకుంటున్నాడు. దూబే ఇప్పుడు కేవలం ఆల్రౌండర్ మాత్రమే కాదు.. టీమిండియాకు అసలైన ‘ఫినిషర్’గా ఎదుగుతున్నాడు.