బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లోనూ మెరుగైన స్కోర్ దిశగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ కారణంగా స్టేడియంలోని ఓ అభిమాని గాయపడ్డాడు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ 6వ ఓవర్లో శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్కు రోహిత్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అది కాస్త గ్యాలరీలో ఉన్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దాంతో అతనికి తీవ్ర గాయమై రక్త స్రావమైంది. వెంటనే స్పందించిన మైదానంలోని భద్రతా సిబ్బంది బాధితుడికి ప్రాథమిక చికిత్స చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా.. ప్రేక్షకుడి ముక్కులోని ఓ ఎముక ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.