భారత క్రికెట్లో మరో కీలక మార్పు జరగబోతుందా? అంటే.. అవుననే సమాధానాలు విపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న అజిత్ అగార్కర్ స్థానంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్, లెజెండరీ బ్యాట్స్మన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ద్రవిడ్ కోచ్గా ఉన్నపుడు భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన విషయం తెలిసిందే. స్వదేశీ, విదేశీ గడ్డలపై అద్భుత విజయాలు అందుకుంది.
భారత జట్టు కోచ్గా తన పదవీకాలంలో రాహుల్ ద్రవిడ్ యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు భవిష్యత్తు రూపకల్పన చేయడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించారు. అతడి ఆలోచన విధానం, ఆటగాళ్లను అర్థం చేసుకునే తత్వం సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి సరైనదిగా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇటీవలి కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే రాబోయే సంవత్సరాల్లో భారత్కు వరుసగా పెద్ద టోర్నీలు ఉండటంతో.. కొత్త దృష్టికోణం అవసరమన్న అభిప్రాయం బోర్డు వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ పేరును బీసీసీఐ పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం.
Also Read: India vs Pakistan: నష్టపరిహారం, సస్పెన్షన్.. పీసీబీ, ఐసీసీ మీటింగ్ లేటెస్ట్ డీటెయిల్స్ ఇవే!
ఈ వార్త నిజమైతే.. భారత క్రికెట్లో ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఆటగాడిగా, కోచ్గా అపార అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్.. సెలక్షన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపడితే, టీమిండియా జట్టు ఎంపిక ప్రక్రియలో స్పష్టత, స్థిరత్వం మరింత పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
