Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ

Rohit Sharma And Virat Kohl

Rohit Sharma And Virat Kohl

Rohit Sharma and Virat Kohli: భారత క్రికెట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు.. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఈ ప్రశ్న మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా స్పందించారు. అయితే రోహిత్, విరాట్‌ల భవిష్యత్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా వ్యూహాత్మక అంశాలను బహిరంగంగా వెల్లడించలేమని పేర్కొన్నారు. జట్టు భవిష్యత్తు, ఆటగాళ్ల పాత్రలు, ప్రపంచకప్ ప్రణాళికలకు సంబంధించిన చర్చలు పూర్తిగా అంతర్గత వ్యవహారాలని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ మీడియాతో మాట్లాడిన దేవ్‌జిత్ సైకియా.. భారత జట్టుకు సంబంధించిన విషయాలపై నిరంతరం సమీక్షలు, చర్చలు జరుగుతుంటాయని తెలిపారు. సెలక్షన్ కమిటీ, క్రికెట్ కమిటీ, హెడ్ కోచ్, సహాయక సిబ్బంది, ఆటగాళ్ల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుగుతాయని చెప్పారు. జట్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం విస్తృత చర్చల అనంతరమే తీసుకుంటామని వివరించారు. అయితే 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి వ్యూహాత్మక చర్చలను మీడియా లేదా ప్రజలతో పంచుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై బీసీసీఐ ఇప్పటికైతే ఎలాంటి సంకేతాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదనే విషయం స్పష్టమైంది.

×
×
Ad

మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రం 2027 ప్రపంచకప్ వరకు వన్డే క్రికెట్ కొనసాగించాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం కూడా ఇద్దరూ వన్డే ఫార్మాట్‌లో కొనసాగాలనే తమ అభిలాషను తెలియజేశారు. అయితే ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. రాబోయే కాలంలో ఇద్దరు ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్, జట్టుకు అవసరమైన సమతుల్యత వంటి అంశాలు వారి భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. అందువల్ల 2027 ప్రపంచకప్‌లో రోహిత్, విరాట్‌ల పాత్రపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలపై కూడా దేవ్‌జిత్ సైకియా స్పందించారు. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో బీసీసీఐ ఎల్లప్పుడూ భారత ప్రభుత్వ విధానాలను అనుసరిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన భారత్-బంగ్లాదేశ్ సిరీస్ విషయంలోనూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ జూన్ 20న చెన్నైలో జరగనుంది.