T20 World Cup 2026 India Pakistan Match in Drought: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. కొలొంబోలో రాత్రి 7 నుంచి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. కొలొంబోలో ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన పాక్.. టీమిండియాను చిత్తు చేయాలని చూస్తోంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో పాక్పై తిరుగులేని రికార్డును కొనసాగిస్తున్న భారత్.. మరో ఐసీసీ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. గతేడాది పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాక ఇండో-పాక్ టీమ్స్ తొలిసారి ప్రపంచకప్లో తలపడబోతున్నాయి.
కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరంగా ఉన్న అభిషేక్ శర్మ.. పాక్తో మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. ప్రాక్టీస్లో కూడా పాల్గొన్నాడు. దాంతో సంజు శాంసన్ డగౌట్కు పరిమితమవుతాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబెలతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ చక్రవర్తికి తోడు అక్షర్ పటేల్, సుందర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఆడనున్నారు.
మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా పటిష్టంగానే ఉంది. ఓపెనర్లు ఫర్హాన్, అయూబ్లు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. సల్మాన్ ఆఘా, బాబర్ ఆజామ్, షాదాబ్ ఖాన్లతో బ్యాటింగ్ విభాగం బాగుంది. ఉస్మాన్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్ ప్రమాదకర ప్లేయర్స్. ఇక ఇప్పుడు అందరి దృష్టీ ఉస్మాన్ తారిఖ్ మీదే ఉంది. అతడి బౌలింగ్ యాక్షన్ బ్యాటర్లను అయోమయానికి గురి చేస్తోంది. అబ్రార్, షాదాబ్ ఖాన్, సయిమ్ అయూబ్ల స్పిన్లో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. షహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్లకు తోడుగా సల్మాన్ మీర్జా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సజావుగా జరగడం కష్టమే అని తెలుస్తోంది. మ్యాచ్ ఇప్పుడు వరుణుడి ఆదీనంలో ఉంది. కొలంబోలో ఆదివారం వర్షం పడే అవకాశాలు 70 శాతం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. లీగ్ ఈ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉందన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు 8 మ్యాచ్లు ఆడాయి. భారత్ 7 విజయాలు సాధించగా.. పాక్ ఓసారి గెలిచింది. 2021 ప్రపంచకప్లో పాక్ విజయం సాధించింది.
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్/రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
పాకిస్థాన్: ఫర్హాన్, అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్, షాదాబ్, ఉస్మాన్, ఫహీమ్, నవాజ్/సల్మాన్ మీర్జా, షహీన్, అబ్రార్, తారిఖ్.