ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆరోపిస్తూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం జరిమానా విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది.
ఐసీసీ నియామవాళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్ తక్కువగా 20 శాతం ఫైన్ విధిస్తారు. అదే రెండు ఓవర్లు తక్కువ వేస్తే 40 శాతం జరిమానా వేస్తారు. టీమిండియా రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో 40 శాతం ఫైన్ పడింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆన్ ఫీల్డ్ అంపైర్లు మరైస్ ఎరాస్మస్, బొంగాని జెలే, థర్డ్ అంపైర్ పాలేకర్, ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్ స్టాక్ ఫిర్యాదు చేయగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే టీమిండియాను విచారించకుండానే ఐసీసీ జరిమానా వేయడం గమనార్హం.