టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను బీసీసీఐ సెలక్టర్ పరోక్షంగా హెచ్చరించారు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భువనేశ్వర్కుమార్ రాణించకుంటే పుజారా, రహానే మాదిరి జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హితవు పలికారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు పడిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో టీ20 సిరీస్ భువనేశ్వర్కు కూడా డెత్ సిరీస్ అని భావించొచ్చన్నారు. గత ఏడాది ఐపీఎల్ నుంచి భువనేశ్వర్ బౌలింగ్లో పదును తగ్గిందన్నారు.
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో తొలి టీ20లో భువనేశ్వర్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఈ ప్రదర్శన అంత గొప్పదేమీ కాదు. అయితే రెండు, మూడు టీ20ల్లో భువనేశ్వర్ మెరుగైన ప్రదర్శన చేయకపోతే అతడిపై భవిష్యత్లో వేటు పడే అవకాశం ఉందని సెలక్టర్లు సూచనప్రాయంగా చెప్పేశారు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల్లో రెండు మాత్రమే ఆడిన భువనేశ్వర్ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో విండీస్తో సిరీస్లో వన్డేలకు ఎంపిక కాలేదు.