శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు టీమిండియా మరింత బలోపేతం అయ్యింది. తొలి టెస్టుకు గాయం కారణంగా దూరంగా ఉన్న అక్షర్ పటేల్.. రెండో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తగిన ఫిట్నెస్ సాధించిన అక్షర్ పటేల్ ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడంతో కుల్దీప్ యాదవ్ టీం నుంచి బయటకు వెళ్లాడు. తొలి టెస్టుకు అక్షర్ పటేల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా రెండో టెస్టుకు జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రతిభ చూపడంతో మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగిసిపోయింది.