Origin of Gold: భూమిపై బంగారం ఎలా ఏర్పడుతుంది? కొన్ని ప్రాంతాల్లోనే భారీ పసిడి నిక్షేపాలు ఎందుకు ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో ఒక అద్భుతమైన ‘భూగర్భ రహస్యాన్ని’ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. జర్మనీకి చెందిన ‘జియోమార్ హెల్మ్హోల్ట్జ్ సెంటర్ ఫర్ ఓషన్ రీసెర్చ్’ బృందం జరిపిన ఈ అధ్యయనంలో, సముద్ర గర్భంలోని అగ్నిపర్వత ద్వీప సమూహాలు సహజమైన ‘బంగారు కర్మాగారాలు’ అని తేలింది. అసలు బంగారం ఎలా పుట్టింది, సముద్రం అడుగున ఉన్న ఈ గోల్డ్ ఫ్యాక్టరీకి దారి ఏది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!
కెర్మాడెక్ దీవులే పసిడి కేంద్రాలు
న్యూజిలాండ్ సమీపంలోని కెర్మాడెక్ దీవుల కింద ఉన్న అగ్నిపర్వత వ్యవస్థను డాక్టర్ క్రిస్టియన్ టిమ్ నేతృత్వంలోని బృందం తాజాగా అధ్యయనం చేసింది. భూమి యొక్క మాంటిల్ (అంతర్భాగం) పదేపదే కరగడం వల్ల బంగారం సాంద్రత పెరుగుతుందని ఈ పరిశోధన నిరూపించింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగే ప్రక్రియ కాదని, కొన్ని కోట్ల ఏళ్లుగా జరుగుతున్న ఒక సంక్లిష్టమైన ‘భౌగోళిక చక్రం’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు ఇవే..
టెక్టోనిక్ ప్లేట్ల మ్యాజిక్: పసిఫిక్ మహాసముద్ర ఫలకం వంటి టెక్టోనిక్ ప్లేట్లు మరొక ప్లేట్ల కిందకు చొచ్చుకుపోయినప్పుడు, విపరీతమైన పీడనం వల్ల నీరు రిలీజ్ అవుతుంది. ఈ నీరు భూమి లోపలి మాంటిల్లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న రాళ్లు కరిగేలా చేస్తుంది.
స్వేదనం: మాంటిల్ పదార్థం అనేకసార్లు కరగడం వల్ల, బంగారం, రాగి వంటి లోహాలు ద్రవ రూపంలో వేరుపడి మాగ్మాలో స్టోర్ అవుతాయి.
అగ్నిపర్వత గాజు : సముద్రం అడుగున లావా నీటితో తాకినప్పుడు తక్షణమే గడ్డకట్టి ‘గాజు’ లాగా మారుతుంది. శాస్త్రవేత్తలు సేకరించిన 66 నమూనాల్లో సాధారణం కంటే అత్యంత అధిక స్థాయిలో బంగారం సాంద్రత ఉన్నట్లు గుర్తించారు.
గతంలో కెర్మాడెక్ ప్రాంతాన్ని కేవలం ఒక ద్వీప సమూహంగానే చూసేవారు. కానీ తాజా అధ్యయనంతో ఇక్కడ బంగారం, రాగి, భారీ సల్ఫైడ్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో సముద్రగర్భంలోని ఖనిజ వనరులను గుర్తించడానికి ఒక ‘బ్లూప్రింట్’ (ప్రణాళిక) లాగా పనిచేస్తాయని అన్నారు. భూమి లోపలి పొరల నుంచి బంగారం ఎలా ప్రయాణించి సముద్రపు అడుగు భాగానికి చేరుతుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మైలురాయి లాంటి ఆవిష్కరణగా అభివర్ణించారు. ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రిక ‘కమ్యూనికేషన్స్ ఎర్త్ & ఎన్విరాన్మెంట్’లో ప్రచురితమైన ఈ స్టోరీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూగర్భ శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.