పోయినచోటే వెతుక్కోవాలని జనసేనాని చూస్తున్నారా? అందుకే ఆ నియోజకవర్గంపై మళ్లీ ఫోకస్ పెడుతున్నారా? మరోసారి బరిలో దిగుతారా లేక.. అక్కడ పార్టీని బలోపేతం చేస్తారా? కొత్త ప్లాన్ వర్కవుట్ అయ్యేనా? ఏంటా వ్యూహం? లెట్స్ వాచ్..!
భీవమరం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఆ ఆసక్తికి కారణం. అవే ఎన్నికల్లో గాజువాక నుంచి కూడా పవన్ కల్యాణ్ బరిలో ఉన్నప్పటికీ.. ఎక్కువ చర్చ జరిగింది భీమవరం పైనే. జనసేనాని భీమవరం, గాజువాక రెండు చోట్లా ఓడిపోయారు. ఓటమికి దారితీసిన పరిస్థితులు ఎలా ఉన్నా.. భీమవరంలో పవన్ కల్యాణ్ నెగ్గుకు రాలేకపోవడం ఇప్పటికీ హాట్ టాపిక్కే. ఆ ఎన్నికలకు ముందు నుంచీ భీమవరంలో జనసేన ప్రత్యేకంగా వర్కవుట్ చేసినా.. కలిసిరాలేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. చాలా నియోజకవర్గాలు చర్చల్లో ఉన్నాయి. అయితే పోయినచోటే వెతుక్కోవాలనే లెక్కలో ఏమో.. భీమవరం నుంచి మరోసారి జనసేనాని బరిలో దిగుతారనే ఆశలు పార్టీ శ్రేణుల్లో ఉన్నాయట. తాజాగా పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్లు దానికి సంకేతంగా భావిస్తున్నారట.
జనవాణి-జనసేన భరోసా పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న పవన్ కల్యాణ్.. త్వరలో భీమవరంలోనూ ఆ ప్రొగ్రామ్ నిర్వహించబోతున్నారు. చాలారోజుల తర్వాత పవన్ భీమవరం వస్తుండటంతో.. అక్కడ పార్టీ శ్రేణులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి మళ్లీ పోటీపై ఏదైనా సంకేతాలు ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారట. జిల్లాల పునర్విభజన తర్వాత పశ్చిమగోదారికి భీమవరం జిల్లా కేంద్రమైంది. అరకొర వసతుల మధ్య జిల్లా ప్రభుత్వ ఆఫీసులు నడుస్తున్నాయి. సమస్యలు ఇంకా రెట్టింపు అయ్యాయన్నది జనసైనికుల మాట. అందుకే పవన్ కల్యాణ్ నిర్వహించే జనవాణికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారట. పనిలో పనిగా ఈ కార్యక్రమం ద్వారా.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట లోకల్ పార్టీ నేతలు.
భీమవరం వైసీపీలో లుకలుకలు ఉన్నాయని.. అవి అధికారపార్టీకి ఇబ్బందిగా మారతాయని అంచనా వేస్తున్నారట స్థానిక జనసేన నేతలు. పవన్ కల్యాణ్పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్ మంత్రి పదవి ఆశించి భంగపడ్డారని.. అప్పటి నుంచి ఆయనతోపాటు.. అనుచరులు అసంతృప్తితో ఉన్నట్టు లెక్కలేస్తున్నారట. ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ రావడంతో.. పవన్ కల్యాణ్ కూడా వస్తారని అనుకున్నారు. కానీ ఆయన రాలేదు. అదే కార్యక్రమంలో లోకల్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్కు సైతం సరైన ప్రాధాన్యం దక్కలేదనే చర్చ జరుగుతోంది. అందుకే ఈ సమయంలో పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన రాజకీయంగా వేడి రగిలిస్తుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
జనవాణిలో ప్రజలు ప్రస్తావించే అంశాలపై ఇప్పటి నుంచే పోరాటం చేస్తే భీమవరంలో మరింత పట్టు దొరుకుతుందని జనసైనికులు అనుకుంటున్నారట. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే.. పవన్ కల్యాణ్కు గెలుపు ఇంకా ఈజీ అవుతుందనే వాదన వినిపిస్తున్నారు. పొత్తు కుదిరినా.. కుదరకపోయినా.. భీమవరంలో జనసేన బలాన్ని పెంచే దిశగా అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చారట జనసైనికులు. అయితే భీమవరంలో పోటీపై పవన్ కల్యాణ్ ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసేది క్లారిటీ లేదు. మరి.. జనసేనాని టూర్ను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకుంటారో.. లేక పవన్కు అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి.