ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో మూడు కుటుంబాల నుంచి గతంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. కోట్ల కుటుంబంలో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాష్రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాత బరిలో ఉన్నారు. భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు? పోటీకి దూరంగా ఉండేదెవరు అనేది చర్చగా మారింది.
డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించిన తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకుంది. కేఈ కుటుంబం నుంచి ప్రభాకర్, శ్యాంబాబులు మరోసారి బరిలో దిగాలని చూస్తున్నారు. వీరిలో ప్రభాకర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. డోన్ లేదా ఆలూరు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నా.. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించేశారు చంద్రబాబు. ఇక మిగిలింది ఆలూరు. అక్కడ కోట్ల సుజాత కర్చీఫ్ వేశారు. ఏదీ కాకపోతే కర్నూలు ఎంపీగా అయినా బరిలో దిగుతానని చెబుతున్నారట. అయితే అక్కడ కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఉన్నారు. దీంతో కేఈ ప్రభాకర్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. పత్తికొండను వీడేది లేదంటున్నారు ప్రభాకర్ అన్న కుమారుడు కేఈ శ్యాంబాబు.
కోట్ల కుటుంబంలో టీడీపీ టికెట్లు ఆశిస్తోంది ఇద్దరే. ఒకరు సూర్యప్రకాష్రెడ్డి. రెండో వ్యక్తి సుజాతమ్మ. వీరిలో సూర్యప్రకాష్రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో చంద్రబాబు ఆయన్ని కాదనే పరిస్థితి లేదంటున్నారు. ఆలూరులో కోట్ల సుజాతకు టీడీపీ నుంచే నలుగురు నేతలు పోటీగా ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వానికే మొగ్గు చూపొచ్చన్నది ఒక వాదన. అయితే చివరి నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు పార్టీ నేతలు.
ఆళ్లగడ్డ విషయంలో భూమా అఖిల ప్రియ కేంద్రంగా ఇటీవల జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక్కడ బీజేపీ నేతగా ఉన్న ఆమె బంధువు భూమా కిశోర్రెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం ఉంది. అదే జరిగితే కిశోర్రెడ్డికే టీడీపీ టికెట్ ఇస్తారని టాక్ నడుస్తోంది. దీనికితోడు అఖిలప్రియ, కిశోర్రెడ్డి మధ్య వివాదాలు పొలిటికల్ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇక నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి మరోసారి పోటీకి ఆసక్తితోఉన్నప్పటికీ.. అక్కడ ఏవీ సుబ్బారెడ్డి, ఫరూఖ్ల నుంచి పోటీ తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఫరూఖ్ గతంలో పోటీ చేశారు. ఏవీ సుబ్బారెడ్డికి ఇక్కడ పట్టుంది. పైగా అఖిలకు, బ్రహ్మానందరెడ్డికి పడటం లేదని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నేది సస్పెన్స్గా ఉందట. మరి.. డోన్లో క్లారిటీ ఇచ్చినట్టుగానే ఈ కుటుంబాలకు కూడా ముందుగానే చంద్రబాబు స్పష్టత ఇస్తారో లేదో చూడాలి.