తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారంపై బీజేపీ యూటర్న్ తీసుకుందా..? మున్సిపల్ ఎలక్షన్స్లో ఏపీ డిప్యుటీ సీఎం ప్రచారం ఇక లేనట్టేనా..? అంతా రెడీ… జనసేనాని వచ్చేస్తున్నారంటూ ముందు హంగామా చేసి సడన్గా ఎందుకు సైలెంట్ అయినట్టు? పవన్ విషయమై తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అంతర్మథనం ఏంటి..?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతు, పవన్కళ్యాణ్ ప్రచారం విషయంలో కాషాయ పార్టీ వెనక్కు తగ్గిందా అంటే…. అవును, దాదాపుగా అలాగే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఈ ఎన్నికల్లో సింగిల్గానే బరిలోకి దిగుతామని తొలుత చెప్పిన కమల దళం ఆ తర్వాత అనూహ్యంగా జనసేన మద్దతు కోరింది. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పవన్ను కలిసి మద్దతు కోరారు. అందుకు ఆయన కూడా రెడీ అన్నారట. అదే ఊపులో… ఈనెల 7, 8న తెలంగాణలో పవన్కళ్యాణ్ ప్రచారం ఉంటుందని ప్రకటించింది జనసేన. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయ్యిందని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఈ అంశం అస్త్రంగా మారింది. జనసేన ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్టీ అని, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ ప్రచారానికి వస్తే…. మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని అందుకుని సెంటిమెంట్ రగిలించవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు కూడా కమలదళానికి ఉప్పందిందట. అలాగే సొంత పార్టీలోని ఓ వర్గం నేతలు సైతం దీన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది.
తెలంగాణలో ఏమాత్రం ఉనికి లేని పార్టీ మద్దతు కోరడం ఏంటంటూ వాళ్ళు పెదవి విరిచినట్టు సమాచారం. దీనికి తోడు రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి కాషాయ పార్టీ పోటీ చేస్తోంది. అలాగే జనసేన సైతం దాదాపు 350 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. గ్లాస్ పార్టీ అభ్యర్థులు లేని చోట బీజేపీకి మద్దతిస్తూ పవన్ ప్రచారం చేయడం ఒకేగానీ…రెండూ బరిలో ఉన్న ప్రాంతాల్లో పవన్ ఎవరికి ఓటు వేయాలని కోరుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా… ఈ గందరగోళపు పరిస్థితుల్లో…. బీజేపీ రాష్ట్ర నాయకత్వం డైలమాలో పడిందట. ఇక బ్యాక్ స్టెప్ తీసుకుంటే బెటర్ అనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనిపిస్తున్న వాతావరణం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే…. ఈనెల 7, 8 తేదీల్లో పవన్ ప్రచారం ఉంటుంది. కానీ…. దానికి సంబంధించి ఎక్కడా క్లారిటీ లేదు, ఆ దిశగా ఏర్పాట్లు లేవు.
Also Read: Telangana Municipal Election: మున్సిపల్ ఎన్నికలవేళ.. గులాబీ పార్టీలో గొడవ మొదలైందా?
ఒక పార్టీకి అధ్యక్షుడిగా, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రిగా, అలాగే… సినీ గ్లామర్ ఉన్న నాయకుడి సభ అంటే… సహజంగానే కాస్త హైప్ ఉంటుంది. కానీ… ఇక్కడ అలాంటి వాతావరణం ఏదీ కనిపించకపోవడంతో… ఇక వెనకడుగు వేసినట్టేనన్న అభిప్రాయం బలపడుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈనెల 9న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రచారానికి అతి తక్కువ సమయమే ఉన్నా…. జనసేన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటు కాషాయ పార్టీ సైతం… ముందు వేరే ఆలోచన చేసినా… తర్వాత మాత్రం జనసేనాని ప్రచారం లేకుంటేనే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన మద్దతుతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశాలున్నట్టు అభిప్రాయపడుతున్నారట తెలంగాణ బీజేపీ నాయకులు. అందుకే యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పవన్కళ్యాణ్ మీద గంపెడాశలు పెట్టుకున్న జనసేన అభ్యర్థులు మాత్రం డీలా పడే అవకాశం ఉంది.