మున్సిపల్ ఎన్నికలవేళ గులాబీ పార్టీలో గొడవ మొదలైందా..? లోకల్, స్టేట్ లెవల్ అంటూ విభేదాలు పెరుగుతున్నాయా? మేనేజ్మెంట్ కోసం పంపిన సమన్వయకర్తలతోనే సమన్వయం లోపిస్తోందా? అసలేంటా లోకల్, నాన్ లోకల్ గోల? ఆ విషయంలో పార్టీ అధిష్టానం అభిప్రాయం ఎలా ఉంది?.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్లో ఉంది. ముగింపు గడువు దగ్గర పడుతున్న టైంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలను నియమించింది బీఆర్ఎస్. రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నియమించిన ఈ సమన్వయకర్తలు షెడ్యూల్ కంటే ముందుగానే ఆయా మున్సిపాలిటీలకు వెళ్ళి… టికెట్ల కేటాయింపు నుంచి బీ ఫామ్స్ ఇచ్చే వరకు దగ్గరుండి చూసుకున్నారు. చివరకు రెబెల్స్తో విత్ డ్రా చేయించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే… కొన్ని వార్డుల్లో స్థానిక పొత్తుల్ని కూడా వాళ్లే ఫైనల్ చేశారు. ఇదంతా తమకు కలిసి వచ్చే అంశంగా చెబుతోంది బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం. కానీ…. అసలు కథ ఇక్కడే మొదలైంది. రాష్ట్ర పార్టీ సూచన మేరకు వెళ్లి మున్సిపాలిటీల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న సమన్వయకర్తలపై భగ్గుమంటున్నారు కొందరు లోకల్ ఇన్ఛార్జ్లు. కీలకంగా ఉన్న తమను కాదని కొత్తగా ఎక్కడి నుంచో సమన్వయకర్తలుగా వచ్చిన వాళ్లు టికెట్ల కేటాయింపు ఎలా చేస్తారు అంటూ మండిపడుతున్నారు.
Also Read: Suryakumar Yadav-Mr 360: సూర్యా భాయ్.. ‘మిస్టర్ 360’ అని మరోసారి నిరూపించావ్!
ఇది తమని తక్కువ చేసి చూడటమేనంటూ ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గ ఇన్చార్జ్లు. పార్టీ హైకమాండ్ పంపిన వాళ్ళు కదా అని గౌరవం ఇస్తే… మొత్తం పెత్తనం తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇన్నాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా కార్యకర్తలకు అండగా ఉన్న తమను కాదని కొన్నిచోట్ల టికెట్లు కేటాయించడం, మరికొన్ని చోట్ల ప్రచారాల షెడ్యూలు నిర్ణయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్ర పార్టీ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను కావాలనే పంపించామని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మాత్రం వారినే కీలకంగా వ్యవహరించమని చెప్పినా… గత ఎన్నికల్లో ఓడిపోయి ఇన్చార్జ్లుగా ఉన్నచోట మాత్రం సమన్వయకర్తల మాట వినాల్సిందేనని తేల్చి చెప్పేస్తున్నారట. వారి మీద నెగెటివ్ అభిప్రాయం ఉండబట్టే గత ఎన్నికల్లో ఓడిపోయారని… ఇంత త్వరగా.. వారి మీద పాజిటివిటీ పెరిగే అవకాశం లేదు కాబట్టే… రాష్ట్ర సమన్వయకర్తలను పంపించామని చెబుతున్నారు. ఈ మధ్య పలు సభల్లో మాట్లాడిన కేటీఆర్ కూడా గత ఎన్నికల సమయంలో కేసీఆర్ మీద ఎవరికీ వ్యతిరేకత లేదని, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోనే ప్రజలు వారిని ఓడించారని చెప్పుకొస్తున్నారు.
వారే ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉండటంతో ఆ కోపాన్ని పార్టీ మీద పడకుండా ఈ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారని చెబుతోంది బీఆర్ఎస్ అధిష్టానం. చాలాచోట్ల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు సర్దుకుపోతున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రం బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల వరకు మాత్రమే ఉండి వెళ్లే సమన్వయకర్తలు కాదు, ఎన్నికల తర్వాత కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేది మేమేనని అంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ కూడా తమ ద్వారానే జరగాలని, పార్టీ నుంచి వచ్చే నిధులు తమకే అందజేయాలని కోరుతున్నారు నియోజకవర్గం ఇన్ఛార్జ్లు. విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నా…. ఎక్కడా అవి బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. అదే తమకు కలిసివచ్చే అంశంగా చెబుతోంది బీఆర్ఎస్. ఈ లుకలుకల రిజల్ట్స్ ఫైనల్గా ఎలా ఉంటాయో చూడాలి మరి.