రాష్ట్ర రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన ఆ ముగ్గురు టీడీపీ ముఖ్యులు ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి అడ్డంగా బుక్ అయ్యారా? కేవలం కాసు కక్కుర్తితోనే వాళ్ళు ఆ పని చేయబోయారా? కథ క్లైమాక్స్లో టీడీపీ అధిష్టానానికి తెలిసి తలంటేసిందా? ముగ్గురి పరిస్థితి ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా మారిపోయిందా? ఎవరా ముగ్గురు? ఈ కథలో రాయలసీమకు చెందిన ఓ మంత్రి వియ్యంకుడి పాత్ర ఏంటి?
కాకినాడ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్…. స్టేట్ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ… అది నచ్చని వైసీపీ నాయకుడు ఒకరు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతూ…. అందుకు ముగ్గురు తెలుగుదేశం సీనియర్ నాయకుల సాయం తీసుకున్నారని, వాళ్ళు కూడా సై అన్నారన్న ప్రచారం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. ఆ ముగ్గురిలో ఇద్దరు… గత టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు వెలగబెట్టి ఉండటం ఇంకా సంచలనమైంది. ఇది తెలిసిన ఉమ్మడి తూర్పు గోదావరి తమ్ముళ్లు కొందరైతే…. ఎంత డబ్బు కక్కుర్తి ఉంటే మాత్రం ఏంటీ… చిల్లర రాజకీయం అంటూ సదరు సీనియర్స్ని కామెంట్ చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు మొదటి నుంచి రైస్ మిల్లర్ల అసోసియేషన్లో పెత్తనం చెలాస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా తన పట్టు తగ్గకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ క్రమంలోనే… టీడీపీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రిని సంప్రదించగా… సై… మేం సపోర్ట్ చేస్తామని అన్నారట.
అనుకున్నదే తడవుగా నియోజకవర్గాల వారీగా రైస్ మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. సరిగ్గా… అక్కడే మేటర్ టీడీపీ అధిష్టానానికి చేరి చెక్ పడిందట. వాళ్ళ మిలాఖత్ ప్రకారం ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూర్యప్రకాష్ని అవిశ్వాసంతో దించేయాలన్నది ప్లాన్. రైస్ మిల్లర్ల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అవిశ్వాసంతో పదవి నుంచి దిగిపోతే ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హత ఉండదు. దానికి అనుగుణంగానే వైసీపీ మాజీ ఎమ్మెల్యే గట్టి ప్రయత్నాలు చేశారట. తన వర్గానికి చెందిన వ్యక్తినే రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేసే పనిలో భాగంగా అధికార పార్టీ నేతలకు మంచి ఆఫర్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. వాళ్లు కూడా కన్విన్స్ అయిపోయి…. వచ్చిన అవకాశాన్ని తమకు కలిసి వచ్చేలా ప్లాన్ చేశారట. తమ నియోజకవర్గాల్లోని రైస్ మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రస్తుత అధ్యక్షుడిని దింపడానికి అట్నుంచి నరుక్కుని వచ్చారట. వ్యవహారం అంతా కొలిక్కి వస్తున్న టైంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ కథ మళ్ళీ మొదటికి వచ్చిందంటున్నారు. సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ మొదటి నుంచి రైస్ బిజినెస్లో ఆరితేరింది. ఆయనైతే… ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మీద గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు పరిధి దాటి మాట్లాడారన్న విమర్శలున్నాయి. అలాంటి వ్యక్తితో సొంత పార్టీకి చెందిన కీలక నేతలు కలిసి పోవడాన్ని టీడీపీ ముఖ్యులు సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును మర్చిపోయారా? ఆయన వాడిన పదజాలాన్ని మర్చిపోయారా? మీ వ్యక్తిగత వ్యవహారాల కోసం అంతా పక్కన పెట్టేస్తారా అంటూ అమరావతి నుంచి ఘాటుగా ప్రశ్నించినట్టు తెలిసింది. అదే ఊపులో… ఇక ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని క్లారిటీగా చెప్పేసి పక్క జిల్లాకు చెందిన ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. అప్పటికీ తగ్గని ఆ ఆ ముగ్గురు టీడీపీ కీలక నేతలు మనం స్థానికంగా మిల్లర్ల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా అంటూ సర్ది చెప్పబోయారట.
కానీ… అలాంటి అభిప్రాయాలతో పనిలేదని, ప్రభుత్వ పాలసీ, పెద్దల నిర్ణయాల ప్రకారం పని చేయాలని తేల్చేసినట్టు సమాచారం. మరోవైపు రాయలసీమకు చెందిన ప్రస్తుత మంత్రి వియ్యంకుడు కూడా రైస్ మిల్లర్స్ సంఘంలో కీ లీడర్గా ఉన్నారు. దాంతో… ఈ ఎపిసోడ్లో ఆయన జోక్యం చేసుకుని సర్దిచెప్పబోగా….మంత్రి నో అన్నట్టు తెలిసింది. పరిధి దాటి ప్రవర్తిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారట ఆయన. అదలా ఉంటే…. సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే టిడిపికి చెందిన ఇద్దరు శాసనసభ్యులు, మాజీ మంత్రికి మరో ఆఫర్ కూడా ఇచ్చారట.. రైస్ మిల్లులు ప్రభుత్వానికి సన్న బియ్యం సరఫరా చేయాలి. దాని బదులు ముతక బియ్యం వచ్చేలా తాను ఒప్పందం చేస్తానని, అది కూడా కొంత కలిసి వస్తుందని చెప్పారట. ఇదేదో బాగుందని అంతా టెప్ట్ అయిపోయి కథ క్లైమాక్స్కు వచ్చిన టైంలో… మేటర్ లీకై ప్రభుత్వ పెద్దల వార్నింగ్తో అంతా వెనక్కి తగ్గారట. ఈ విషయంలో ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్… ప్రస్తుతం రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సూర్య ప్రకాష్ అదే పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ పెద్దల వైపు నుంచి క్లారిటీ ఇవ్వడంతో ఇక ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. మొత్తానికి కాసుల కక్కుర్తితో ఏదో… చేద్దామనుకున్న టీడీపీ ముఖ్యులు ముగ్గురికీ…. పదవులు అనుభవించి ,హోదాలు పొంది చివరికి చేసే చిల్లర రాజకీయాలు ఇవేనా అంటూ అక్షింతలు పడ్డాయట.. స్టేట్ పాలిటిక్స్లో బాగా పేరున్న ఆ ముగ్గురు మేటర్ బెడిసి కొట్టేసరికి తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారని తూర్పు గోదావరి తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.