అయిననూ పోయిరావలె హస్తినకు…! ఇదే కాన్సెప్ట్తో చంద్రబాబు అండ్ కో ఢిల్లీ వెళ్లిందా? దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆయన ఏదైనా సాధిస్తారా? ఈ సమయంలో టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
టీడీపీ ఆఫీసులపై దాడులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు..!
టీడీపీ ఆఫీస్పై దాడి చేశారనే అంశంపై ఒక రోజు రాష్ట్ర బంద్కు పిలుపిచ్చి.. మరో రెండు రోజులు దీక్ష చేపట్టిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపిస్తూ.. ఆ విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నేతలు చెప్పారు. అయితే అమిత్షా అపాయింట్మెంట్ లభించకపోవడంతో రాష్ట్రపతి దగ్గరకు వెళ్లారు నాయకులు. ఇటీవల జరిగిన సంఘటనలు.. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీపై దాడి.. దీనివెనక వైసీపీ ఉందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేలా వివరాలను రాష్ట్రపతికి తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఉన్నాయని రామ్నాధ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లింది చంద్రబాబు బృందం. అలాగే డ్రగ్స్కు అడ్డాగా ఏపీ మారుతోందనే అంశాన్ని ప్రస్తావించారు నాయకులు.
ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీలో కొందరు ఆందోళన..!
ఇంత వరకు బాగానే ఉన్నా.. చంద్రబాబు ఢిల్లీ టూర్పై ఇప్పుడు ఇంకోలా చర్చ జరుగుతోందట. రెండేళ్ల తర్వాత ఢిల్లీకి వెళ్తే.. అదీ రాష్ట్రపతిని కలుస్తోంటే.. దానికి బలమైన కారణం ఉండాలి. ప్రజా సమస్యలు.. అవినీతి.. లేదా రాష్ట్ర ప్రయోజనాలనో అజెండాలో ప్రస్తావించాలి. కానీ.. పార్టీ ఆఫీస్పై దాడి చేశారు. దీనికి అధికారపార్టీ సహకరించింది. ఆ దాడికి పోలీసులు సహకరించారనే ఆరోపణలే ప్రధాన అజెండాగా పెట్టుకుని రాష్ట్రపతిని కలవడంవల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోందట. పోలవరం.. అమరావతి.. ప్రత్యేకహోదా.. విభజన సమస్యలు.. తదితర కీలక అంశాలు చాలా ఉన్నాయి. వాటిని కాదని.. టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందనే విషయాన్ని బేస్ చేసుకుని వెళ్తే.. ఇదేదో ఏపీలోని రాజకీయాలను రాష్ట్రపతికి బ్రీఫ్ చేయడానికి వెళ్లినట్టుగా ఉంటుందని సెటైర్లు వేస్తున్నారట. దీనివల్ల పార్టీకి మైలేజ్ వచ్చే సంగతి అంటుంచి.. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట.
ఈ సమయంలో ప్రజల అటెన్షన్ తీసుకురాగలరా?
పార్టీ కార్యాలయం అని కాకుండా.. మత్తు పదార్థాల సరఫరాకు ఏపీ కేరాఫ్ అడ్రస్గా మారిందనే విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికే తాము హస్తిన బాట పట్టామనేది టీడీపీ వాదన. కానీ.. ఢిల్లీకి ఎందుకెళ్లారో జనాలకు తెలిసిపోయింది. ఈ సమయంలో అది కాదు.. ఇది కాదు అని ఎంత అరచి గీపెట్టినా ప్రజల అటెన్షన్ కష్టమే. దీంతో రానున్న రోజుల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్పై ఎదురయ్యే రాజకీయ విమర్శలపై అంచనా వేసే పనిలో పడ్డారట కొందరు నాయకులు.