ఆ మాజీ మంత్రి గురించి తెలుగుదేశం పార్టీలో డిఫరెంట్ డిస్కషన్ జరుగుతోందా? మనోళ్ళు తొందరపడ్డారన్న అభిప్రాయం బలపడుతోందా? రకరకాల కేసులతో ఆయన మీదే మైనస్ ఉన్న టైంలో మనమే బూస్ట్ ఇచ్చామా అన్న మీమాంసలో టీడీపీ నాయకులు ఉన్నారా? ఆయన క్యాస్ట్ కార్డ్కు అధికార పార్టీ కౌంటర్స్ సిద్ధం చేస్తోందా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ సిద్ధం చేస్తున్న అస్త్రాలేంటి?
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విషయమై తెలుగుదేశం పార్టీలో ఇప్పుడో కొత్త రకమైన చర్చ జరుగుతోందట. ఇంటి మీద దాడికి వెళ్ళి మనోళ్ళు కాస్త తొందరపడ్డారా? రాజకీయంగా అంత ఫామ్లో లేని, అంతో ఇంతో వ్యతిరేకత ఉన్న వ్యక్తికి మనమే సానుభూతి కల్పించి మైలేజ్ ఇస్తున్నామా అని పార్టీ లీడర్స్ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. జోగి వ్యవహారాన్ని మరోలా డీల్ చేసి ఉంటే బాగుండేదన్నది కూడా టీడీపీలో కొందరి అభిప్రాయంగా తెలుస్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగి రమేష్…. వైసీపీ హయాంలో రెండేళ్ళు మంత్రిగా పనిచేశారు. 2019లో పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారాయన. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసం పైకి దాడికి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీ శ్రేణుల టార్గెట్ లిస్టులో చేరిపోయారని చెబుతారు. ఇక కేబినెట్ బెర్త్ దక్కాక మరింత జోరు పెంచి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద హద్దులు దాటి మాట్లాడారని అటు జనసేన వర్గాలు కూడా గుర్రుగా ఉన్నాయి.
అయితే… ఆ టైంలో జోగి మాటలు కొందరికి ఉత్సాహం ఇచ్చినా….. దానివల్ల మైనస్ కూడా ఎక్కువే అయిందని వైసీపీ నేతలే కొందరు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇక ఎన్నికల టైంలో నియోజకవర్గం మారి పోటీ చేసినా… భారీ తేడాతో ఓడిపోయారాయన. ఓటమి తర్వాత తిరిగి తన స్వస్థలమైన మైలవరం నియోజకవర్గానికి ఇన్చార్జ్గా వెళ్ళడం, ఆ తర్వాత నకిలీ మద్యం కేసు వెలుగులోకి రావడం, అందులో జోగి రమేష్ అరెస్ట్ అవడం వరుస పరిణామాలు. నకిలీ మద్యం కేసులో రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము కూడా 83 రోజులు పాటు జైల్లో ఉన్నారు. ఓవైపు మాట తీరు, మరోవైపు నకిలీ మద్యం కేసు, ఇంకోవైపు అగ్రిగోల్డ్ భూముల కేసులో ఆయన కొడుకుతోపాటు అనుచరులు అరెస్ట్ అవడం లాంటి వ్యవహారాలతో మాజీ మంత్రి ఇమేజ్ కొంతవరకు డామేజ్ అయిందని భావిస్తున్న టైంలో ఇంటి మీద దాడిచేసి మళ్ళీ మనమే మైలేజ్ తెచ్చామా అన్న మథనం మొదలైందట టీడీపీ నాయకులు కొందరికి. నకిలీ మద్యం కేసులో బెయిల్ మీద బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం, జోగి రమేష్ కూడా బీసీ కార్డ్ బయటికి తీయడంతో…. తదనంతర పరిణామాలకు సంబంధించి తెలుగుదేశం కేడర్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ బీసీ నేతలు, మాజీ మంత్రులు జోగి ఇంటికి వచ్చి పరామర్శిస్తుండటం పొలిటికల్ అటెన్షన్ తీసుకు వస్తోంది. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే సరిపోయేదని, దాడి చేయడం వల్ల ఆయనకే సానుభూతి వర్కౌట్ అయిందన్న చర్చ జరుగుతోందట అధికార పార్టీలో. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా జోగి మాటల వల్లే వ్యవహారం ఇంతదాకా వచ్చిందని అంటూనే…. అదే సమయంలో భౌతిక దాడులు చేయడం కూడా సరికాదని, దాన్ని ఖండిస్తున్నానని అన్నారు. అదే సమయంలో జోగి రమేష్ బీసీ కార్డ్ని గట్టిగా వాడుతున్నా…. టీడీపీ వైపు నుంచి ఆ స్థాయిలో బీసీ లీడర్స్ కౌంటర్స్ చేసుకోలేకపోతున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అయితే…. ఈనెల 5న ఇబ్రహీంపట్నంలో జోగి నివాసం సమీపంలోనే బీసీ సంఘాలతో ఆత్మ గౌరవ సభ పెట్టాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఈ సభ ద్వారా జోగి బీసీ క్లెయిమ్కు చెక్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు కులం గురించి మాట్లాడుతున్న రమేష్… తాను మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏం చేయలేదన్న విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లటానికి ఈ సభను వేదికగా చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఈ సింపతీ గేమ్లో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.