ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటింటికీ అంటారు. పార్టీలోని మిగతా నాయకులు ఇదేం ఖర్మ అని రోడ్డెక్కుతారు. మధ్యలో తెలుగు తమ్ముళ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆధిపత్యపోరులో సైడ్ అవడమే బెటర్ అని జారుకుంటున్నారట. టీడీపీలో రసవత్తరంగా మారిన ఈ సన్నివేశాలు ఎక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
కాకినాడ రూరల్ టీడీపీలో ఎవరికి వారే..!
కాకినాడ రూరల్లో టీడీపీ వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. లీడర్లు క్యాడర్కి కొదవ లేకపోయినా పెత్తనం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో పిల్లి అనంతలక్ష్మి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. గత ఎన్నికలు తర్వాత పార్టీలో ఉన్న వ్యక్తులతో విభేదాలొచ్చి పిల్లి ఫ్యామిలీ పసుపు కండువాని పక్కన పెట్టేసింది. 4 నెలల క్రితం టిడిపి అధినేతను కలిసి తాము యాక్టివ్గా ఉంటామని చెప్పి గేర్ మార్చే పనిలో పడ్డారు. అయితే పిల్లి ఫ్యామిలీ పార్టీకి దూరమైన తర్వాత కొందరు TDP నేతలు ఎవరిస్థాయిలో వాళ్లు పగ్గాల కోసం ప్రయత్నించారు. అధిష్టానం మాత్రం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎవరికి వాళ్లు తామే లీడర్లమని తెగ హడావిడి చేసేసారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కలగూరగంపల తయారైంది టీడీపీ పరిస్థితి.
సొంతంగా కార్యక్రమం చేపట్టిన అనంతలక్ష్మి
కాపు ఉద్యమంలో పనిచేసిన ఏసుదాసు ఈ మధ్యనే టిడిపిలో జాయిన్ అయ్యారు. టీడీపీ నేతలు పేరాబత్తుల రాజశేఖర్, శ్రీనివాస్బాబా సైతం సీటు ఆశిస్తున్నారు. టీడీపీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని కార్యక్రమం చేపట్టినా.. తనను ఇంఛార్జ్గా ప్రకటించక పోవడంతో ఆ కార్యక్రమం చేయబోనని భీష్మించారు అనంతలక్ష్మి. పైగా ఇంటింటికీ మీ అనంతలక్ష్మి అని ఆమె కొత్త స్లోగన్ ఎంచుకున్నారు. దీంతో ఆశావహులు మరింత అడ్వాన్స్ అయ్యారు. మిగతా ముగ్గురు కలిసి పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాలు చేపట్టారు. అంతా ఒకే పార్టీలో ఉన్నా.. ప్రస్తుతం టీడీపీ నుంచి రెండు కార్యక్రమాలు నడుస్తున్నాయి. చివరకు ఎన్టీఆర్ వర్ధింతిని వేర్వేరుగా నిర్వహించారు నాయకులు.
టీడీపీకి ఇదేం ఖర్మ అని కేడర్ సెటైర్లు
నాయకుల పోకడ చూశాక.. కాకినాడ రూరల్లో ఇదేం ఖర్మ మన పార్టీకి అని తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం టికెట్ కేటాయించేదాకా ఓపికగా ఉండి కలిసి పనిచేయడం మానేసి ఇదే పని అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ సమస్యను జిల్లా పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావిస్తే.. ఆ గొడవ మాకెందుకు అని దూరం పెడుతున్నారట. దీనికితోడు ఒకరి ప్రొగ్రామ్కు వెళ్లిన వారిని మరో గ్రూపు దగ్గరకు రానివ్వడం లేదట. కాకినాడ రూరల్ సీటు గత నాలుగు ఎన్నికలుగా టిడిపి శెట్టిబలిజలకు ఇస్తోంది. పరిణామాలు మారిపోవడంతో పక్కనే ఉన్న రామచంద్రపురం ఈసారి ఇంఛార్జ్గా శెట్టిబలిజలకు ఇచ్చారు. కాకినాడ సిటీ, కోఆర్డినేటర్ గా బిసి వర్గానికి చెందిన కొండబాబు ఉన్నారు. ఈ లెక్కలన్నీ వేసుకున్న పిల్లి వ్యతిరేకవర్గంలోని కాపు సామాజికవర్గానికి చెందిన ఏసుదాసు, రాజశేఖర్లు రూరల్లో కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు. ఒకవేళ శెట్టిబలిజలకే ఇవ్వాలనుకుంటే శ్రీనివాస్బాబాకి కేటాయించాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారట. పార్టీ కష్టకాలంలో కాడి వదిలేసి వెళ్లిపోయిన ఫ్యామిలీని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారట. తమ ముగ్గురిలో ఎవరికి సీటు ఇచ్చినా కలిసి పని చేస్తామని కొత్త మెలికలు పెడుతోందట పిల్లి వ్యతిరేక వర్గం. మరి టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో.. ఎవరిని ఇంఛార్జ్గా నియమిస్తుందో చూడాలి.