తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డు విషయమై కూటమిలో భిన్న వాదనలున్నాయా? లడ్డు కల్తీ చర్చలో ఎవరిది పైచేయి అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదా? అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది? ప్రస్తుతం కూటమి వర్గాల్లో దీనికి సంబంధించి నడుస్తున్న డిస్కషన్ ఏంటి? మనకు మైలేజ్ వచ్చిందా? లేక మనమే సభ సాక్షిగా సంజాయిషీ ఇచ్చుకున్నామా? తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ప్రస్తుతం కూటమి వర్గాల్లో మొదలైన అంతర్మథనం ఇది. ఇది మనకు ప్లస్సా మైనస్సా అన్న విషయమై పార్టీల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయట. వైసీపీ హయాంలో శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతు కొవ్వు అవశేషాలు కలిశాయని, నకిలీ నెయ్యి వాడటమే అందుకు కారణం అంటూ నిరుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత రాజకీయ వివాదాలు, సీబీఐ సిట్ ఏర్పాటు లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
ఆ క్రమంలోనే… ఎలాంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని, వెరీ లెస్ అంటూ…. సిట్ రిపోర్ట్ వచ్చింది. దానికి కొనసాగింపుగా… లడ్డూల్లో వాడిన నెయ్యి తయారీకి కెమికల్స్ వాడారని, ఆ కెమికల్స్లో టాయ్లెట్ క్లీనర్స్ సైతం ఉన్నాయంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. అందుకు వైసీపీ వైపు నుంచి కూడా గట్టిగానే కౌంటర్స్ పడుతున్నాయి. ఇలా… ఒకదానివెంట ఒకటిగా… లడ్డు చుట్టూ రాజకీయ వివాదం రగులుతూనే ఉంది. ఈ కొనసాగింపులోనే తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో లడ్డు కల్తీపై చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు…. అప్పటి రిపోర్ట్ ప్రకారమే.. తాను జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పానని అన్నారు.
నాడు లడ్డూల తయారీకి వాడిన నెయ్యి మాత్రం ఖచ్చితంగా కల్తీ అయిందని చెప్పారాయన. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… అప్పటి ప్రభుత్వ అధిపతికి దీనితో నేరుగా ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పంతా నాటి టీటీడీ బోర్డ్దేనని అన్నారాయన. ఈ కామెంట్స్ పై.. ఇప్పుడు కూటమి వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. లడ్డు అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి మనం సంజాయిషీ ఇచ్చుకున్నామా? లేక దానివల్ల మైలేజ్ ఏమన్నా వచ్చిందా అంటూ రకరకాల కోణాల్లో విశ్లేషించుకుంటున్నారట కూటమి నాయకులు. శ్రీవారి మహాప్రసాదం విషయంలో అంతకుముందు అన్ని ఆరోపణలు చేసి… చివరకు అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా మాట్లాడలేకపోయామని ఓ వర్గం గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం లడ్డు విషయంలో ఏదో చేసేసిందని ముందంతా తీవ్ర ఆరోపణలు గుప్పించి…. తీరా అసెంబ్లీ సమావేశాలకు వచ్చేసరికి మాత్రం… ఆ స్థాయిలో వాయిస్ వినిపించలేకపోయామని అది కాస్త మైనస్సేనని మాట్లాడుతున్నారట కూటమి నేతలు కొందరు. అన్నిటికీ మించి ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ గత ప్రభుత్వ అధినేతకు సంబంధం లేదంటూ పరోక్షంగా జగన్కు క్లీన్చిట్ ఇచ్చారని, ఇది ఇబ్బందికరమైన అంశమేనని అంటున్నారు.
రాష్ట్రంలో ఇంకేం సమస్య లేదన్నట్టు లడ్డు అంశం పై రోజులకు రోజులు మాట్లాడి చివరకు చట్టసభలో తుస్సు మనిపించామంటూ కొందరు నాయకులు నిర్మొహమాటంగా మాట్లాడుతున్నట్టు సమాచారం. మండలిలో ఎలాగూ వైసిపి పైచేయిలో ఉందని, ఎంతో అవకాశం ఉన్న శాసనసభలో కూడా తిరుమల లడ్డుపై చర్చ తమకు పెద్దగా కలిసి రాలేదన్నది ఓ వర్గం అభిప్రాయం. అయితే… అదే సమయంలో మరో వర్గం నుంచి ఇంకో రకమైన మాట వినిపిస్తోంది. మనకు ఇది ఎంతమాత్రం మైనస్ కాదు, అది కొవ్వా , కెమికలా అన్న సంగతిని పక్కనపెట్టి వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డుల తయారీకి మాత్రం కచ్చితంగా కల్తీ నెయ్యి వాడారన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగామంటున్నారు. దీనికి సంబంధించిన చర్చ సామాన్య ప్రజల్లో, స్వామి భక్తుల్లో సైతం ఎక్కువగా జరగడం వల్లే… అప్పుడు, ఇప్పుడు అంటూ లడ్డుల నాణ్యతను పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయని, ఒక రకంగా ఇది పైచేయి సాధించడమేనని వాదించే వాళ్ళు సైతం ఉన్నారు. మొత్తం మీద ఆ విధంగా ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది ఆ ఏడు కొండలవాడికే తెలియాలి.