మహిళా రిజర్వేషన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారా? ఆ దిశగా తమ వారసుల్ని సమాయత్తం చేస్తున్నారా? నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో పట్టు చేజారకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? ఏయే నాయకులు తమ కుమార్తెల పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు? కూతురు అసెంబ్లీలో అధ్యక్షా అంటుంటే… చూడాలని కలలుగంటున్న ఆ తండ్రులెవరు? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతోపాటు.. మహిళా రిజర్వేషన్లు కూడా అమలులోకి రాబోతున్నాయి. దీంతో… ఉన్న అవకాశాన్ని వదులుకోకుండా, ఇతరులకంటే ముందు మనమే పాగా వేయాలన్న టార్గెట్తో కొందరు తెలంగాణ నాయకులు పావులు కదుపుతున్నారు. మహిళల కోటా పెరుగుతున్నందున నాయకులంతా తమ వారసురాళ్ళను రంగంలోకి దింపే పనిలో బిజీగా ఉన్నారట. ఒకవేళ తమ పాత నియోజకవర్గాలు మహిళా కోటాలోకి వెళ్ళినా అక్కడ పట్టు తగ్గకుండా కుమార్తెలతో పొలిటికల్ అరంగేట్రం చేయించే యోచనలో ఉన్నారు పలువురు నాయకులు. ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు.
ఇప్పటికే కొందరు నాయకుల కూతుళ్ళు జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా… ఈసారి వాళ్ళని అసెంబ్లీ బరిలోకి దించాలనుకుంటున్నారట. ఈ వరుసలో ముందున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అన్నీ కలిసివస్తే… కుమార్తె జయారెడ్డితో గత లోక్సభ ఎన్నికల్లోనే పోటీ చేయించాలని అనుకున్నారు జగ్గారెడ్డి. మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకున్నా… వాతావరణం అనుకూలించక అప్పట్లో డ్రాప్ అయ్యారట. ఇక ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నియోజకవర్గాల పెంపు జరిగి కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ, ఎంపీ సీట్లోగాని… జయారెడ్డితో పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి నుంచి తాను బరిలో ఉండబోనని ఇప్పటికే ప్రకటించారాయన. అక్కడి నుంచి ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డి పోటీలో ఉంటారని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు త్రిష కూడా పొలిటికల్ యాక్టివ్గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి పోటీ చేసిన అందోల్ నియోజకవర్గంలో అంతా తానై పాదయాత్ర నిర్వహించారు త్రిష. రేపు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయించి ఆమెను ఛైర్పర్సన్ చేసేందుకు కూడా రాజనర్సింహ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక అసెంబ్లీ సీట్లు పెరిగి… మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే…ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు రెడీ అవుతున్నారట. అటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూతురు డాక్టర్ గోదారెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మహిళా కోటా సీట్లు పెరిగితే..
తన కూతుర్ని రంగంలోకి దించే ఆలోచనలో నాయిని ఉన్నట్టు తెలుస్తోంది. అటు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఇప్పటికే ప్రకటించేశారు. పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ఓ సభలో కామెంట్స్ కూడా చేశారామె. నియోజకవర్గం సంగతి ఎలా ఉన్నా… ఈసారి ఎన్నికల్లో కొండా వారసురాలి పోటీ మాత్రం ఖాయం. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు కూడా రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు అనన్య. చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయిన లిస్ట్లో చేరారామె. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహిళా కోటా సీట్లు పెరిగితే… అనన్యతో అధ్యక్షా అని పిలిపించాలనుకుంటున్నారట స్పీకర్.గజ్వేల్ లో నర్సారెడ్డి కూతురు ఆకాంక్షా రెడ్డి కూడా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే జిల్లా అధ్యక్షురాలి పదవి కట్టబెట్టింది పార్టీ. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబం నుంచి కూడా మరో పొలిటికల్ ఎంట్రీ ఉండవచ్చంటున్నారు.
భట్టి భార్య నందిని గతంలోనే పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. గాంధీభవన్ వరకు భట్టి అభిమానులు ర్యాలీని నిర్వహించి టికెట్ ఇవ్వాలని కోరారు. ఇక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వారసురాలిగా కీర్తి రెడ్డి ఇప్పటికే జనంలో ఉన్నారు. చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భరత్ భార్య కూడా రేస్లో ఉన్నారు. గద్దర్ కూతురు వెన్నెల ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. కంటోన్మెంట్ నుంచి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన వెన్నెల… ఈసారి మహిళా కోటాలో వచ్చే సీటు కోసం చూస్తున్నారట. మొత్తానికి మహిళా రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అడుగులేస్తున్నారు. ఈ వాతావరణం చూస్తుంటే… త్వరలోనే చాలామంది మహిళా నేతలు తెర మీదికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నది పొలిటికల్ టాక్.