ఆ మాజీ ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారా? నియోజకవర్గంలో వర్గపోరుతో ఇక తనకు ప్లేస్ లేదనుకున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో అనుచరులు గులాబీ బీ ఫామ్స్ మీద పోటీ చేయడం కూడా అందులో భాగమేనా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఎక్కడ తేడా కొట్టి తిరిగి పాత పార్టీ వైపు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు? కామారెడ్డి జిల్లా బాన్సువాడ హస్తం పార్టీలో వర్గ పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్కు చేరుకుందట. కాంగ్రెస్ అధిష్టానం పోచారానికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించగా.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రవీందర్ రెడ్డి భవితవ్యం ఇపుడు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు.. నిన్నటి మున్సిపల్ ఎలక్షన్స్లో రవీందర్ రెడ్డి వర్గీయులకు పోచారం టికెట్లు ఇవ్వలేదట. దీంతో రవీందర్ రెడ్డి తన వర్గీయులను కాంగ్రెస్ రెబల్స్గా నిలబెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ కారణంగా కొన్ని చోట్ల కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థులు ఓడిపోయారన్న విశ్లేషణలున్నాయి. ఇక ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ.. ఏనుగు వర్గీయులకు కేవలం ఒక్క సీటు ఇవ్వడంతో మండిపోయిన ఆ టీమ్ మొత్తం బీఆర్ఎస్ బీ ఫామ్స్తో పోటీ చేయడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసిందట. ఇప్పుడు దాని చుట్టూనే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. బాన్సువాడలో అంతా తాను అనుకున్న రవీందర్ రెడ్డి ఆధిపత్యానికి అడుగడుగునా పోచారం చెక్ పెడుతున్నారట. దాంతో…. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నట్లు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ నేతకు కాంగ్రెస్ లో ప్రాధాన్యం తగ్గుతోందంటూ కార్యకర్తలు ఆవేదనగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఏనుగు రవీందర్రెడ్డి సైతం తన దారి తాను వెదుక్కోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆయనకు షాక్ ఇవ్వటంతో ఎటు తేల్చుకోలేక పోతున్నారట.
తన అనుచరులు గులాబీ కండువాలు కప్పుకుని ఆ పార్టీకి దగ్గర అవుతుంటే ఆయన వారించకపోవడం వెనక వేరే ఆలోచనలున్నట్టు తెలుస్తోంది. తనకు ప్రాధాన్యత దక్కకపోతుందా అని ఇన్నాళ్లు వేచి చూసినా ఇక లాభం లేదని తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని నిర్ణయించుకున్నారట.. దీంతో ఏనుగు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరు నేతలు ఒకరి పై మరొకరు పరస్పరంగా అధిష్టానికి పిర్యాదులు చేసుకున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓటమికి రవీందర్ రెడ్డి కారణం అంటూ పోచారం వర్గీయులు ఆరోపిస్తుండగా.. దాన్ని రవీందర్ రెడ్డి వర్గం కొట్టి పారేస్తోంది. కానీ అధిష్టానం పెద్దలు రవీందర్ రెడ్డి పై ఒకింత ఆగ్రహంగా ఉన్నారట. ఇటీవల జరిగిన పరిణామాల పై ఆయన నుంచి వివరణ తీసుకుంటామని ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో ఆయన పై చర్యలు ఉంటాయా అనే చర్చ జరుగుతోందట… వర్గపోరులో పోచారం శ్రీనివాస్ రెడ్డి .. రవీందర్ రెడ్డి మీద పైచేయి సాధిస్తుండగా.. ప్రాధాన్యత కోసం వేచి చూస్తున్న రవీందర్ రెడ్డి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి లో నాలుగు సార్లు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 లో బీజేపీలోకి వెళ్ళి..తరువాత కాంగ్రెస్కు దగ్గరయ్యారాయన. 2023 లో బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు ఏనుగు. పార్టీ అధికారంలోకి రావటంతో కీలకంగా మారుదామని అనుకుంటున్న టైంలో పోచారం కాంగ్రెస్ లో చేరటం రవీందర్రెడ్డికి మింగుడుపడని అంశమైంది. దీంతో ఆయన తిరిగి కారెక్కే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.