మొయినాబాద్ ఫామ్ హౌస్లో అలేం జరిగింది? అది కేవలం కొందరు బడా బాబులు కలిసి చేసుకున్న డ్రగ్స్ పార్టీయేనా ? లేక అంతకు మించా? పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఎందుకు కలుసుకున్నారు? ఆ మీటింగ్లో దుబాయ్ మేటరేంటి? అసలు మొయినాబాద్ ఫామ్హౌస్కు దుబాయ్కు లింక్ ఏంటి? మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ రకరకాల కొత్త వాదనలు చర్చల్లోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన ఫామ్హౌస్లో ఇచ్చిన వీకెండ్ పార్టీకి టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్సహా పలువురు వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు అటెండ్ అయ్యారు. అలాగే… వీళ్ళందరి మధ్యన ప్రియాంక రెడ్డి ఎందుకున్నారన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. ఏడాది క్రితం నార్సింగి డ్రగ్స్ కేసులో కూడా ప్రియాంకరెడ్డి పేరు మోగిపోయింది.
ఇప్పుడు ఈ కేసులో సైతం ఆమె పేరే ప్రముఖంగా వినిపించింది. అటు పోలీసులు కూడా ముందు సరయు రెడ్డి అని రాసి ఫైనల్గా ప్రియాంక రెడ్డి అని ఎందుకు మార్చారన్న అనుమానాలు కూడా ఉన్నాయి చాలామందికి. అసలు వ్యాపార లావాదేవీల క్రమంలోనే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ ఇచ్చాడా లేకుంటే అంతకు మించిన వేరే కారణాలున్నాయా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి, టీడీపీ సిట్టింగ్ ఎంపీకి మధ్య కాంట్రాక్ట్ బంధం ఏర్పడినట్టు చెప్పుకుంటున్నారు. ఆ కాంట్రాక్ట్ల నేపధ్యమే వీళ్లిద్దర్నీ దగ్గరికి చేర్చిందా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. తాను వీకెండ్ పార్టీ ఇస్తున్నట్టు చాలా రోజుక క్రితమే రోహిత్రెడ్డి వీళ్ళందరికీ సమాచారం ఇచ్చి ఫాలోఅప్ చేశాడట.
పైలట్ రోహిత్రెడ్డి హిమాచల్ ప్రదేశ్ ,హర్యానా, ఢిల్లీలో వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాగే… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా బిజినెస్లు ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాపార లావాదేవీలన్నిటినీ కలుపుకొని ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకునే క్రమంలోనే అంతా సమావేశమై ఉండవచ్చన్న అంచలాలున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… ఇదే సందర్భంలో మరో అంశం కూడా తెర మీదికి వస్తోంది. ఇక్కడి చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులకు దుబాయ్లో పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. గతంలో వాటి సెటిల్మెంట్స్కు సంబంధించి కూడా పలు వివాదాలు రేగాయి. ఈ మీటింగ్లో ఆ ప్రస్తావన కూడా వచ్చిందా? మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి, దుబాయ్కి లింక్స్ ఉన్నాయా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో