కాంగ్రెస్ నేతలు కొందరికి సీఎం రేవంత్రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? మున్సిపల్ ఎన్నితల ఫలితాలు తేడా పడితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారా? అందుకే ఆ నాయకులు లాస్ట్ మినిట్లో ఉరుగులు పరుగులు పెట్టారా? ఎవర్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి? అసలెందుకు ఆ పరిస్థితి వచ్చింది? సీఎంకు ఎందుకు అనుమానం వచ్చింది? వార్డు సభ్యుడి ఎన్నికైనా, పార్లమెంట్ సభ్యుడి ఎన్నికైనా నేను ఒకే రకంగా చూస్తాను. ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్దులను గెలిపించడానికి కృషి చేస్తాను. చిన్న ఎన్నిక అని దేన్నీ తేలిగ్గా తీసుకోను. అది నా నైజం. అందుకే మున్సిపల్ ఎలక్షన్స్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. ప్రచారం ముగింపు సందర్భంగా మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. పురపాలక ఎన్నికల విషయంలో ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో ఈ మాటలే చెబుతున్నాయి. అలాంటిది ఫలితాల్లో తేడా వస్తే ఊరుకుంటారా? మున్సిపల్లో ఓడిపోవడానికి మంత్రులు, సొంత పార్టీ నాయకులే కారణమైతే వదిలేస్తారా…? ఇదీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తనకు ఎక్కడో కాస్తో కూస్తో అనుమానం ఉన్న మున్సిపాలిటీ, కార్పొరేషన్స్లోని పార్టీ నేతలకు ఈ మేరకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. బయటికి నేరుగా చెప్పకున్నా…. ఈ ఫలితాలను తన రెండేళ్ల పాలనకు పట్టణ ప్రాంత ప్రజలు ఇచ్చే తీర్పుగా సీఎం భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అందుకే ప్రచారాన్ని కూడా సీరియస్గానే చేశారని అంటున్నారు. ఆరోపణలు, విమర్శలతో పాటు అభివృద్ధి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చి పరిస్థితిని సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీని ఒకే గాటిన కట్టి దుమ్మెత్తిపోశఆరు రేవంత్రెడ్డి. అయితే…. ఓవరాల్గా ప్రజా తీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని భావిస్తున్నప్పటికీ…. ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న సమాచారాన్ని సీఎం చెవిన వేశాయట ఇంటెలిజెన్స్ వర్గాలు. అందుకే ఆయన అప్రమత్తమైనట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలోని మూడు కార్పొరేషన్లో, కొన్ని మున్సిపాలిటిల్లో తేడా రిజల్ట్కు అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్తో స్ట్రాంట్ ఫైట్ ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు, ఆయా జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు కొన్ని చోట్ల రిజల్ట్ కాస్త అటు ఇటుగా వస్తుందనే సమాచారంతో ఆయా జిల్లాల మంత్రులకు, కీలక నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత మున్సిపాలిటీల్లో ఓడిపోతే ప్రభుత్వ పనితీరుపై తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి…సీరియస్గా ఉండాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఏమాత్రం తేడా వచ్చిన ఊరుకునేది లేదని స్ట్రాంగ్గానే అన్నట్టు చెప్పుకుంటున్నారు.
దీంతో… కొన్ని ఏరియాల మంత్రులు, కీలక నేతల పదవులపై కత్తి వేలాడుతున్నట్టు తేలిపోయిది. ఇప్పటి వరకు అంటీముట్టనట్లుగా ఉన్న, స్థానిక నేతలకు వదిలేసిన మంత్రులు, ముఖ్యనేతలు ఈ వార్నింగ్ తర్వాత ఉరుకులు పరుగులు పెట్టారట. ఎలాగైనా తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెలుచుకోవాలని, అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని మంత్రులు, ముఖ్యనేతలు లోకల్ లీడర్స్కు చెప్పడమే కాకుండా…తమ వంతు సహాయం కూడా చేస్తున్నారట. మొత్తం మీద సీఎం వార్నింగ్ ఫలించి నేతలు అయితే పరుగులు పెట్టారు. క్షేత్రస్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా ఫలితాలు, వారి భవిష్యత్ ఎలా ఉంటాయో చూడాలి మరి.