Off The Record: అక్కడ నడిపించాల్సి నాయకులే… కేడర్ కొట్టుకుంటుంటే నడి రోడ్డులో నిలబడి చోద్యం చూస్తున్నారట. నాక్కావాలి…. నాక్కావాలి… అంటూ తెగ ఆరాటపడి పోయి టిక్కెట్ తెచ్చుకున్న అభ్యర్థి కనీసం ప్రచార రథాల్ని కూడా సమకూర్చకుండా తమాషా చూస్తున్నారట. చివరికి నామినేషన్ కూడా ఇద్దరితో వేయించిన పరిస్థితి. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటి అక్కడ జరుగుతున్న హై డ్రామా?
అసలే గోరుచుట్టు- ఆపై రోకటిపోటు అన్నట్టుగా తయారైందట పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే ఇక్కడ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ను ప్రకటించింది పార్టీ అధిష్టానం. టిక్కెట్ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా… ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదట గోమాస. దీంతో క్యాడర్ నుంచి రాష్ట్ర పార్టీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. టికెట్ తెచ్చుకున్నాక క్యాడర్కు కాదు కదా.. కనీసం లీడర్స్కి కూడా దొరకనంత బిజీ అయ్యారట గోమాస శ్రీనివాస్… అధిష్టానం అంచనాలకు తగ్గట్టుగా ఆయన యాక్టివ్గా లేరని క్షేత్ర స్థాయి నివేదికలు పార్టీ పెద్దలకు వెళ్ళినట్టు ప్రచారం ఉంది. మిగతా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే… కనీసం క్యాంపెయిన్ కోసం వాహనాలను కూడా ఏర్పాటు చేయలేదట గోమాస. ఈ విషయమై పలుమార్లు పార్టీ ఇంచార్జ్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు నాయకులు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందు కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో టికెట్ విషయంలో పునరాలోచించాలని అనుకున్నట్టు తెలిసింది. అదే సమయంలో గోమాస శ్రీనివాస్ సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీలోకి వచ్చి చేరారు. దాంతో అభ్యర్థిని మార్చడం దాదాపు ఖాయమని జోరుగా ప్రచారం జరిగినా… నామినేషన్ల చివరి రోజు శ్రీనివాస్కు బీఫామ్ ఇచ్చింది బీజేపీ. అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా బీ ఫామ్ ఇస్తూనే… అలర్ట్ అభ్యర్థిగా ఎస్.కుమార్ పేరును కూడా చేర్చడంతో ఉపసంహరణ వరకు అభ్యర్థి ఎవరనేది, పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఏమో తెలియని గందరగోళం నెలకొంది.
అధిష్టానం ఇస్తున్న ట్విస్టులు ఇలా ఉంటే… నియోజకవర్గంలో నాయకుల మధ్య వార్ మరోలాగా తయారైందట…గోమాస శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ పెద్దపల్లి ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్ రావు వర్గీయులు ఘర్షణకి దిగారు. రోడ్డుపైనే పరస్పరం దాడులు చేసుకున్నారు… క్రమశిక్షణ గల పార్టీగా పేరున్న బీజేపీలో కార్యకర్తలు వీధిపోరాటాలకు దిగడంతో నాయకులు నోరెళ్ళబెట్టాల్సి వచ్చిందట. మూడు గ్రూపులుగా తయారైన పెద్దపల్లి బీజేపీ వార్ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ జోక్యం చేసుకునే దాకా వెళ్ళినట్టు తెలిసింది. పార్టీ పెద్దలు, సంఘ్ పరివార్ ఇంచార్జ్లు చెప్పినా నేతల తీరు మాత్రం మారడం లేదంటోంది లోకల్ కేడర్. నియోజకవర్గంలో కొత్త , పాత నేతల మధ్యన రోజు రోజుకి గ్యాప్ పెరుగుతూనే ఉందట. ఆఖరికి నామినేషన్ ర్యాలీకి కూడా కొంత మంది సీనియర్ నేతలు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. దీంతో నేతల మధ్య విభేదాల కారణంగా మొదటికే మోసం వస్తుందన్న భయం బీజేపీ పెద్దల్లో బయలుదేరిందంటున్నారు. పార్టీ పట్ల పాజిటివ్ వేవ్, మోడీ చరిష్మా లాంటి అంశాలు సానుకూలంగా ఉన్నప్పటికీ .. స్థానిక విభేదాల కారణంగా ఓటర్ల దగ్గరికి ఆ అంశాలను తీసుకు వెళ్ళడంలో విఫలమవుతున్నట్టు గుర్తించారట పార్టీ పెద్దలు. సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ కీలక సమావేశం నిర్వహించి నేతలకు దిశా నిర్దేశం చేశారట. గత పదిహేను రోజులుగా ప్రచార సరళి ఏవిధంగా సాగింది….? అభ్యర్థి వ్యవహార శైలి, నాయకుల సమన్వయ లోపాలపై ఖచ్చితమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పుకుంటున్నాయి స్థానిక బీజేపీ వర్గాలు. సంఘ్ ఇంచార్జీ జోక్యం తో ఈ గొడవ సద్దుమణుగుతుందని కొంతమంది నేతలు చెబుతున్నాట. అయితే సోషల్ మీడియాలో మాత్రం వర్గాల వారీగా పోస్టింగ్ లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసేందుకు కేడర్ ఉత్సాహంగా ముందుకు వస్తున్నా నేతల తీరుతో పెద్దపల్లి బీజేపీలో అసలేం జరుగుతోందో అర్థంకాని అయోమయం నెలకొందట.