Off The Record: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. CWCలో చోటు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలోని పార్టీ నేతలు. CWC అనేది పార్టీలో కీలక కమిటీ. ఇంతలో రాయ్పూర్ కాంగ్రెస్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. వాస్తవానికి రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా వచ్చాక.. ఆయనతో చాలా మంది సీనియర్లకు పడటం లేదు. రేవంత్ను వ్యతిరేకించేవాళ్లంతా AICCలో పదవులు ఆశిస్తున్నారు. హైకమాండ్ మూడ్ కూడా అలాగే ఉందనే చర్చ నడుస్తోంది. అందులో వాస్తవం ఎంతో ఏమో.. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాలతో కాంగ్రెస్లో జాతీయ స్థాయి పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఏకంగా CWCలో సభ్యత్వం వస్తుందని పలువురు సీనియర్లు ధీమాగా ఉన్నారు. వారిలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, గాంధీ కుటుంబానికి సన్నిహితమైన V హన్మంతరావు, పీసీసీ చీఫ్ పదవి ఆశించి.. ఆ పోస్ట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్ఠానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
CWCలో చోటు ఆశించడంతో తప్పు లేకపోయినా.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల విషయంలో హైకమాండ్ ఆలోచన ఏంటన్నదే ప్రశ్న. ఒకరు పదవులు ఆశిస్తే.. వారికి రాకుండా మరోవర్గం అడ్డుకోవడం కాంగ్రెస్లో కామన్. ప్రస్తుతం టీ కాంగ్రెస్లో ఈ ట్రెండే నడుస్తోందని విమర్శలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్రెడ్డికి AICC ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారనేది ఒక వాదన. ప్రధాన కార్యదర్శి అయితే ఏదో ఒక రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జ్గా వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉత్తమ్ కోదాడ, హుజూర్నగర్, నల్లగొండ లోక్సభ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. పైగా ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో AICC ప్రధాన కార్యదర్శి అయితే ఇంఛార్జ్గా వెళ్లే రాష్ట్రానికి సమయం కేటాయించగలరా అనేది పార్టీ వర్గాల ప్రశ్న.
Read Also: Kiren Rijiju: జడ్జిలది కాదు.. వ్యవస్థదే తప్పు.. పెండింగ్ కేసులపై న్యాయశాఖ మంత్రి..
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి CWCలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉందనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఆ ఒక్కరు ఎవరు అనేది మరో ప్రశ్న. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల కోసం ఎన్నిక నిర్వహించడం లేదని.. ఎంపికే ఉంటుందని రాయ్పూర్ ప్లీనరీలో స్పష్టం చేయడంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని పికప్ చేస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆ ఒక్కరు తెలంగాణ నుంచి ఉంటారా.. లేక ఆంధ్రప్రదేశ్కు ఛాన్స్ ఇస్తారో తెలియాలి. తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రానికే ప్రాధాన్యం ఇస్తారనేది కొందరి వాదన. అయితే ప్లీనరీ కమిటీలలో తెలంగాణ కంటే ఏపీ కాంగ్రెస్ నాయకులకు వివిధ కమిటీల్లో పెద్దపీట వేయడంతో స్పష్టంగా ఓ అంచనాకు రాలేని పరిస్థితిలో ఉన్నారు నాయకులు. ప్రస్తుతం CWCలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో సుబ్బిరామిరెడ్డి ఉన్నారు. INTUC కోటాలో CWCలో ఆహ్వానితులుగా ఉన్నారు సంజీవ్రెడ్డి. కొత్త కమిటీలో వీరిద్దరినీ కొనసాగిస్తారా.. కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది చర్చే.