Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?

  • నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లపై అధిష్టానం స్పెషల్‌ ఫోకస్‌..
  • అందరి పనితీరుపై ప్రత్యేకంగా విశ్లేషణలు..
  • చాలామంది ఇన్ఛార్జ్‌లు పని దొంగలుగా మారినట్టు నివేదికలు..
  • పని చేయని వారిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు?..
  • ప్రజా పోరాటాలు చేయడంలో సీనియర్స్‌ వెనకడుగు..
  • హైదరాబాద్‌ దాటని వారిపై ఇక కఠిన చర్యలు..
  • ఇన్ఛార్జ్‌ల మీదున్న వ్యతిరేకత పార్టీపై పడుతోందని క్లారిటీ..
  • ప్రజలకు అందుబాటులోలేని వారి స్థానంలో కొత్తవాళ్ళు?..
  • ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే ఇక సీరియస్‌ యాక్షన్‌? ..
Otr Brs

Otr Brs

Off The Record: సంస్థాగతంగా పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేయాలనుకుంటున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇప్పుడు సభ్యత్వ నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అయితే…. అంతకంటే ముందు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న అన్ని పదవులను రద్దు చేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. అదే సమయంలో…. నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. పూర్తి ప్రక్షాళనలో భాగంగా వాళ్లను కూడా మార్చేస్తారని ప్రచారం జరిగినా…. ప్రస్తుతానికి ఆ జోలికి పోలేదు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. వాళ్లనేం లైట్‌గా వదల్లేదని, మిగతా పోస్టులకంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకునే క్రమంలోనే ప్రస్తుతానికి నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను కదిలించలేదని అంటున్నారు. ఆ విషయంలో అధిష్టానం బాగా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గాల్లో ఉన్న నేతలు కష్టపడి పనిచేస్తుంటే…. ఇన్చార్జ్‌లు మాత్రం ఆ పని చేయకుండా, ఏదో అలాఅలా…. బండి లాగించేస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట. చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జ్‌లు చల్తీకానామ్‌ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నది మెయిన్‌ కంప్లయింట్‌.

ఇందులో సీనియర్‌ లీడర్స్‌, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే…. దాన్ని సక్సెస్‌ చేయడంలో నియోజకవర్గాల ఇన్చార్జ్‌లు విఫలమవుతున్నారన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయట. పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళలో ఎక్కువ మంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని అధిష్టానం గుర్తించింది. ముఖ్యనేతలు కేటీఆర్, హరీష్‌రావు లాంటి వాళ్ళు స్వయంగా ఫీల్డ్‌లోకి దిగుతున్నప్పటికీ… చాలామందిలో ఇంకా మార్పు రావడం లేదని, హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని నివేదికలు తెలంగాణ భవన్‌కు చేరుతున్నట్టు తెలిసింది. ఇలా… కేరాఫ్‌ రాజధాని అంటున్న నేతల విషయంలో ఇకనుంచి అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెబుతున్నాయి గులాబీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, చావో రేవో తేల్చుకోవాలని భావిస్తున్న అధిష్టానం ఇక నుంచి కఠినంగా వ్యవహరించబోతోందని, నిర్ణయాలు కూడా అందుకు తగ్గట్టే ఉంటాయని అంటున్నారు నాయకులు.

×
×
Ad

నియోజకవర్గాల్లో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోలేని ఇన్చార్జ్‌లను పక్కన పెట్టడానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లోకల్‌గా నియోజకవర్గ ఇన్చార్జ్‌ల మీద ఉన్న కోపం పార్టీ మీద ప్రభావం చూపుతోందని, ఆ విషయాన్ని అధిష్టానం గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇలా ప్రజల్లో తిరగని, పార్టీ కార్యక్రమాలు చేయని ఇన్చార్జ్‌లకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తే… ఆ ఎఫెక్ట్ పార్టీ పై పడుతుందని నేతలు చెబుతున్నారు. అందుకే కాస్త కష్టమైనా… ముందుగానే సీరియస్ నిర్ణయాలు తీసుకునేందుకు వెనకడుగు వేయబోరని చెప్పుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో లేని నేతల స్థానంలో వేరే వారిని ఇన్చార్జ్‌లుగా నియమించాలన్న ఆలోచన కూడా ఉందట. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఇన్చార్జ్‌ల ఎంపిక కూడా ఉంటుందని, అప్పటిలోపు తీరు మార్చుకోని ఇన్ఛార్జ్‌ల స్థానంలో కొత్తవాళ్ళు వస్తారని సీరియస్‌గానే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో… ఆ లిస్ట్‌లో ఎవరెవరు ఉంటారన్న చర్చ జరుగుతోంది.