Off The Record: ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రకరకాల ట్విస్ట్లు పెరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సీరియస్గా ముందుకు పోతోంది. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ… తీగలు ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే… బీజేపీ స్వరం పెంచడం హాట్ టాపిక్ అయింది. దీంతో… ఆ పార్టీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మా ఫోన్ కాల్స్ని కూడా వినేశారు. దాని పరిధి చాలా విస్తృతంగా ఉంది. అందుకే…. దీనిమీద సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేనని తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్టీ అధిష్టానాన్ని వత్తిడి చేస్తున్నారట. బాధితుల లిస్ట్లో కొత్త కొత్త పేర్లు బయటికి వస్తున్న క్రమంలో…. పలువురు నాయకుల్ని సాక్ష్యం కోసం పిలుస్తోంది సిట్. అటు త్రిపుర గవర్నర్ సహా… బీజేపీ జాతీయ నాయకులు పలువురి ఫోన్స్ ట్యాప్ అయ్యాయన్న సమాచారంతో కమలనాథులు కాస్త సీరియస్గానే ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారం తమ ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్నందున…. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా…సీబీఐని రంగంలోకి దింపాలని వత్తిడి చేస్తున్నారట తెలంగాణ నాయకులు. ఆ దిశగా కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవాలని గట్టిగా విన్నపాలు చేస్తున్నట్టు సమాచారం.
Read Also: Donald Trump: “ఐ లవ్ యూ పాకిస్తాన్”.. ఆసిమ్ మునీర్పై ట్రంప్ ప్రశంసలు..
అటు కేంద్ర పార్టీ సూచనతో…. రాష్ట్ర బీజేపీ ఈ వ్యవహారంపై హైకోర్ట్లో పిల్ వేసింది. పార్టీ లీగల్ సెల్… ఈ కేసుపై కోర్ట్లో మెన్షన్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కేసు పరిధి విస్తృతి, తీవ్రత దృష్ట్యా… దీని మీద సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలంటూ కోర్ట్కు వెళ్ళారు బీజేపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని, ఇతర రాష్ట్రాల నాయకుల ఫోన్స్ కూడా ట్యాప్ అయి ఉన్నందున సీబీఐకి ఇస్తేనే… వాస్తవాలు బయటికి వస్తాయన్నది తెలంగాణ కాషాయ నేతల వాదన. ఈ కేసును రాష్ర్ట ప్రభుత్వం వదిలేసినా… మేం వదలబోమని గతంలోనే అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి. సీబీఐ దర్యాప్తు జరిపించాలని తాజాగా కూడా డిమాండ్ చేశారాయన. రేవంత్ సర్కార్ ఆ వ్యవహారాన్ని త్వరగా తేల్చదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ కామెంట్ చేశారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్. టెలికాం చట్టాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి…. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగిస్తేనే…. పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నది కమల నాథుల వాదన.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్..!
బీజేపీ ముఖ్య నేత బీ ఎల్ సంతోష్ ఫోన్ కాల్స్ని కూడా విన్నారని, చివరికి బీఆర్ఎస్…. ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కూడా ఇందులోకి లాగినందున ఈ విషయంలో బీజేపీ సీరియస్గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. నాటి గులాబీ ప్రభుత్వ వ్యవహారంపై కాషాయ నేతలు డీప్గా హర్ట్ అయి ఉన్నందున అంత ఈజీగా వదలకపోవచ్చన్న అభిప్రాయం ఉంది రాజకీయ వర్గాల్లో. విదేశాల్లో ఉన్న వాళ్ళను రాష్ట్రానికి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలా… మొత్తంగా చూసుకుంటే… ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కాంగ్రెస్కంటే మేమే ఎక్కువ సీరియస్గా ఉన్నామన్నది బీజేపీ నేతల మాట. అందుకే సీబీఐ దర్యాప్తు కోసం వాయిస్ పెంచుతున్నారట.