ఆయన ఏపీలో డిప్యూటీ సీఎం. ఆయన్నే లైట్ తీసుకుంటున్నారట అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు. ఇటీవల ఒక విషయంలో తలెత్తిన రగడ చూశాక పార్టీ వర్గాల్లో వస్తోన్న డౌట్ ఇదేనట. ఇంతకీ ఎవరా డిప్యూటీ సీఎం..? ఏంటా మున్సిపల్ కార్పొరేషన్? లెట్స్ వాచ్..!
డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని లెక్క చేయడం లేదా?
ఎక్కడన్నా అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలు కొట్టుకోవడం, తిట్టుకోవటం కామన్. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైసీపీలో మాత్రం డిఫరెంట్. వాళ్లలో వాళ్లకే పడదో.. పదవి ఇచ్చినవాళ్లంటే లెక్కేలేదో ఒక్కటే గోల. ఆళ్ల నాని ఏలూరు ఎమ్మెల్యే. ఆయన డిప్యూటీ సీఎం కూడా. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ టికెట్ వచ్చి.. గెలిచేవరకు ఆళ్ల నాని చుట్టూ తిరిగారు లోకల్ లీడర్స్. తీరా గెలిచాక ఇప్పుడు ఆయన అవసరం లేదనుకున్నారో.. ఏమో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారట.
రామకోటి స్థలం లీజుపై రాజకీయ వేడి..!
ఈ మధ్య ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. 17 అంశాలతో అజెండా ఖరారు చేశారు. ఏలూరులోని రామకోటి స్థలం లీజు అందులో ఒక అజెండా. రామకోటి స్థలాన్ని కాపాడాలని కొంతకాలంగా ఏలూరులో వివిధ పార్టీల నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే కార్పొరేషన్కు ఆదాయం సమకూర్చుకునేందుకు రామకోటి కళావేదిక ప్రాంతంలోని అరఎకరాన్ని మూడు నుంచి నాలుగేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించారట. ఆ విషయాన్నే మున్సిపల్ కార్పొరేషన్ అజెండాలో చేర్చారు. కౌన్సిల్ సమావేశానికి వారం ముందుగానే కార్పొరేటర్లకు అజెండా కాపీలు పంపించారు. అందులో రామకోటి స్థలం లీజుపై వేడి రాజుకుంది.
మేయర్, కార్పొరేటర్లు, అధికారుల తీరుపై ఆళ్ల నానికి ఫిర్యాదు..!
ఏలూరులో స్థానికంగా పొలిటికల్ నిప్పు రాజేస్తున్న రామకోటి స్థలం లీజు అంశాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి మేయర్.. వైసీపీ కార్పొరేటర్లు చెప్పలేదట. అజెండా కాపీ చూశాకే ఆయనకు తెలిసిందని చెబుతున్నారు. వాస్తవానికి కౌన్సిల్లో ముఖ్యమైన అంశాలు అజెండాలో చేర్చే ముందు స్థానిక ఎమ్మెల్యేకు చెబుతుంటారు. రామకోటి స్థలం లీజు గురించి ఆళ్ల నానికి చెప్పలేదనే విమర్శ వైసీపీలోనే ఉంది. ఇదే విషయాన్ని కొందరు పార్టీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారట. మేయర్తోపాటు పార్టీ కార్పొరేటర్లు, కొందరు అధికారులు ఏకపక్షంగా వెళ్తున్నారని ఫిర్యాదు చేశారట. దీంతో ఆ అంశాన్ని పక్కన పెట్టాలని ఆళ్ల నాని ఆదేశించారట. అయితే అప్పటికే అజెండా ప్రింట్ కావడంతో.. అది అందులో అలాగే ఉండిపోయింది.
ఏక్షపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్నామని కొందరు ఆరోపణ..!
కౌన్సిల్ సమావేశం అజెండాలో ఈ అంశాన్ని చూసిన కొందరు అధికారపార్టీకి కార్పొరేటర్లు ప్రశ్నించారట. కొంతమంది మనోభావాలతో ముడిపడి ఉండే అంశాల్లో మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సినచోట ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కార్పొరేటర్లు వాపోయారు. ఇంతకు ముందు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మంత్రి దృష్టికి తెచ్చేవాళ్లు. ఇప్పుడు మంత్రినే లైట్ తీసుకున్న విధానం చూశాక ఏం చేయాలో పాలుపోవడం లేదట.