భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ టెన్షన్ తోనే ఉంటాయి. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత ఏర్పడిన రెండు దేశాల మధ్య కాశ్మీర్ వివాదం, సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద దాడులు ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధిస్తారు..? గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి..? ఎందుకు జరిగాయి..? ఎవరు గెలిచారు..? అనే అంశాలను ఈ స్టోరీలో చూద్దాం.
పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉందని.. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని భారతీయులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిషేధించింది. దౌత్య సంబంధాలను తెంచుకుంది. అయితే ఇవేవీ భారతీయులకు సంతృప్తిని ఇవ్వట్లేదు. పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలించడం వంటి చర్యలు భారతీయుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
Also Read: Pakistan: పాకిస్తాన్ని బిగ్ షాక్ ఇచ్చిన మిత్రదేశం టర్కీ..
పాకిస్తాన్ దశాబ్దాలుగా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనే విషయం అందరికీ తెలుసు. కానీ తమకేమీ తెలియనట్లు బుకాయిస్తుంటుంది. భారత్ ఆధారాలతో సహా పాక్ పాత్రను బయటపెట్టినా నంగనాచి కబుర్లు చెప్తుంటుంది. 2001లో భారత పార్లమెంట్పై దాడి, 2008లో ముంబై ఉగ్రవాద దాడి, 2019లో పుల్వామా దాడి వంటి ఘటనల్లో తమ ప్రమేయాన్ని మొదట పాకిస్తాన్ ఒప్పుకోలేదు. అయితే భారత్ స్పష్టమైన ఆదారాలను అంతర్జాతీయ సమాజం ముందుంచింది. దీంతో పాక్ దిగిరాక తప్పలేదు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఒంటరిని చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలికి ఆధారాలను సమర్పించడం ద్వారా పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం, అంతర్గత రాజకీయ అస్థిరత, బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలు ఆ దేశాన్ని సవాళ్లలో ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సైనిక, ఆర్థిక, దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది. అయితే పాకిస్తాన్ ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమనే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
Also Read: PM Modi: టార్గెట్ పాకిస్తాన్.. మోడీ నివాసంలో రక్షణ మంత్రి, అజిత్ దోవల్ అత్యున్నత భేటీ..
భారత్ – పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండు దేశాలూ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. ఏ క్షణంలో ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయో ఓసారి చూద్దాం. భారత్-పాకిస్తాన్ మధ్య 1947 నుంచి నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి. ఇక చిన్నాచితకా ఘర్షణలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే మొదటిసారి 1947లో భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగింది. దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు ఏడాది పాటు జరిగింది. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత్లో విలీనం కావాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్ మద్దతున్న గిరిజన దళాలు కాశ్మీర్లోకి చొచ్చుకొని వచ్చాయి, దీంతో యుద్ధం మొదలైంది. భారత సైన్యం గిరిజన దళాలను వెనక్కి తరిమి కొట్టింది. కానీ యుద్ధం ముగిసే సమయానికి కాశ్మీర్లో మూడో వంతు భాగం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. దీన్నే మనం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ – POK అని పిలుస్తున్నాం. ఐక్యరాష్ట్ర సమితి జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. నియంత్రణ రేఖ -LoC ఏర్పాటైంది. ఈ యుద్ధంలో భారత్కు వ్యూహాత్మక విజయం లభించినప్పటికీ, కాశ్మీర్ వివాదం పరిష్కారం కాలేదు.
మొదటి కాశ్మీర్ యుద్ధంలో పూర్తి స్థాయి ఫలితం రాలేదు. దీంతో కాశ్మీర్ నిత్యం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. కశ్మీర్ కోసం 1965లో మరోసారి యుద్ధం జరిగింది. భారత్ – పాకిస్తాన్ మధ్య రెండో యుద్ధం 1965లో జరిగింది. దీన్ని రెండో కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు. కాశ్మీర్లో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు “ఆపరేషన్ జిబ్రాల్టర్” ప్రారంభించింది పాకిస్తాన్. గిరిజన దళాలను కాశ్మీర్లోకి పంపింది. వీటిని భారత్ గట్టిగా తిప్పికొట్టడంతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ చొచ్చుకెళ్లి కీలకమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రెండు దేశాలు తమ స్వాధీనంలోని భూభాగాలను తిరిగి ఇచ్చాయి. ఈ యుద్ధంలో సైనిక పరంగా భారత్ పైచేయి సాధించింది.
ఇక భారత్ – పాకిస్తాన్ మధ్య మూడో యుద్ధం 1971లో జరిగింది. ఈ యుద్ధం మూలంగానే బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్.. మనపైనే కాలు దువ్వుతోంది. 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధంగా పిలుస్తారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడింది. అయితే దీనిపై అధికారం ప్రస్తుత పాకిస్తాన్ గా పిలవబడే పశ్చిమ పాకిస్తాన్ చేతిలో ఉండేది. అయితే తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ తమకు స్వాతంత్రం కావాలని పోరాడింది. దీన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ లో మారణహోమం సృష్టించింది. దీంతో బంగ్లాదేశ్ విముక్తికి భారత్ మద్దతుగా నిలిచింది. దీంతో యుద్ధం మొదలైంది. అతి తక్కువ సమయంలోనే తూర్పు పాకిస్తాన్ను భారత్ స్వాధీనం చేసుకుంది. 93వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. బంగ్లాదేశ్ కు స్వాతంత్రం రావడానికి ఈ యుద్ధమే కారణం. ఈ యుద్ధంలో భారత్ తిరుగులేని పైచేయి సాధించింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.
భారత్ – పాకిస్తాన్ మధ్య నాలుగో యుద్ధం 1999లో జరిగింది. దీన్నే కార్గిల్ యుద్ధంగా పిలుస్తారు. ఇందులో కూడా భారత్ కు తిరుగే లేకుండా పోయింది. 1999లో పాకిస్తాన్ సైన్యంతో పాటు కొంతమంది ఉగ్రవాదులు కార్గిల్ రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాలలోకి చొరబడ్డారు. దీనిని భారత సైన్యం గుర్తించింది. “ఆపరేషన్ విజయ్” పేరుతో పాక్ సైన్యాన్ని, టెర్రరిస్టులను తరమికొట్టేందుకు రంగంలోకి దిగింది. దీంతో యుద్ధం ప్రారంభమైంది. భారత సైన్యం అత్యంత కఠిన పరిస్థితుల్లో ఈ యుద్ధం చేసింది. చొరబాటుదారులను వెనక్కి నెట్టింది. పాక్ సైన్యం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఈ నాలుగు యుద్ధాలతో పాటు 2001-02లో భారత పార్లమెంట్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన నెలకొంది. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, 2020-21లో సరిహద్దు ఘర్షణలు వంటి ఘటనలు రెండు దేశాల మధ్య
శాంతిని దెబ్బతీశాయి. ఇప్పుడు మరోసారి భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరు ఎలా పైచేయి సాధిస్తారనేదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే యుద్ధమంటూ వస్తే బారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుచిత్తు కావడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ నిస్సందేహంగా పైచేయి సాధిస్తుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది- సైనిక శక్తి: గ్లోబల్ ఫైర్పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం, ప్రపంచంలో భారత్ నాలుగో అత్యంత శక్తివంతమైన సైన్యంగా ఉంది. భారత సైన్యం వద్ద 14 లక్షలమందికి పైగా సైనికులున్నారు. దాదాపు ఒకటిన్నర లక్షల సాయుధ వాహనాలున్నాయి. 2229 ఎయిర్క్రాఫ్ట్ లు, 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణులు, అర్జున్ ట్యాంకులు, రాఫెల్ ఫైటర్ జెట్స్, సుఖోయ్ వంటి అత్యాధునిక ఆయుధాలు భారత సైన్యం సొంతం. ఇక 2025లో గ్లోబల్ ఫైర్పవర్ ఇండెక్స్ లో పాకిస్తాన్ 12వ స్థానానికి దిగజారింది. పాకిస్తాన్ వద్ద ఆరున్నర లక్షల మంది సైనికులు, 17వేల సాయుధ వాహనాలు, 662 సెల్ఫ్-ప్రొపెల్లడ్ ఆర్టిలరీ యూనిట్లు, అల్-ఖాలిద్ ట్యాంకులు ఉన్నాయి. పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ బలం భారత్తో పోలిస్తే చాలా బలహీనం. ఇక రెండు దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అయితే భారత్కు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంది. దీంతో అణు యుద్ధంలో కూడా భారత్ పైచేయి సాధించడం ఖాయం.
యుద్ధంలో పైచేయి సాధించడానికి సైన్యం మాత్రమే సరిపోదు. ఆర్థిక, అంతర్జాతీయ మద్దతు, అంతర్గత స్థిరత్వం కూడా చాలా ముఖ్యం. వీటన్నిటిలో పాకిస్తాన్ తో పోల్చితో భారత్ ఎంతో ముందుంది. భారత్ రక్షణ బడ్జెట్ 75 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 7.64 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 38వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం గెలవడం అసాధ్యం. భారత్కు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి బలమైన మద్దతు ఉంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఈ దేశాలతో దౌత్య సంప్రదింపులు జరిపి, పాకిస్తాన్ను ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్కు చైనా సహా కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు ఉంది. అయితే వాటి ప్రభావం అంతర్జాతీయంగా అంతంతమాత్రమే. పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత నెలకొంది. బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలు, సైన్యం-ప్రభుత్వం మధ్య సంఘర్షణలు ఆ దేశాన్ని బలహీనపరుస్తున్నాయి. మరోవైపు.. భారత్ మోదీ నేతృత్వంలో రాజకీయంగా ఎంతో స్థిరంగా ఉంది. ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇవన్నీ పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధిస్తుందని చెప్పడానికి నిదర్శనాలు.
భారత్-పాకిస్తాన్ మధ్య గత యుద్ధాల చరిత్రను పరిశీలిస్తే భారత్ నాలుగు ప్రధాన యుద్ధాలలోనూ విజయం సాధించింది. ఇప్పుడు కూడా సైనిక, ఆర్థిక, దౌత్య బలాల ఆధారంగా చూస్తే భారత్ పైచేయి సాధించడం ఖాయం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సరిహద్దు ఉద్రిక్తతలు ఎప్పుడైనా యుద్ధంగా మారే అవకాశం కనిపిస్తోంది
.